వైరల్‌: 75 ఏళ్ల తల్లిని లాగిపడేసి.. చీపురుతో కొట్టి..

12 May, 2021 14:41 IST|Sakshi
వీడియో దృశ్యాలు

సూరత్‌ : తల్లితో దురుసుగా ప్రవర్తించటమే కాకుండా.. చీపురుతో కొట్టిన ఓ దుర్మార్గమైన కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన గుజరాత్‌లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. గుజరాత్‌, మోర్బీ జిల్లాలోని కంటిపూర్‌కు చెందిన మన్‌సుఖ్‌ పర్‌మర్‌ వ్యవసాయ కూలీ. కొద్దిరోజుల క్రితం మన్‌సుఖ్‌ కూతురు ముసలిదైన అతడి తల్లిని ఇంట్లోనుంచి బలవంతంగా బయట తీసుకువచ్చింది. అనంతరం మన్‌సుఖ్‌ ఆమెను లాగి కిందపడేశాడు. నడవడానికి కూడా సరిగా కాళ్లు సహకరించని తల్లిపై మాటలతో విరుచుకుపడ్డాడు. చీపురుతో ఆమెపై దాడి చేయబోయాడు. మన్‌సుఖ్‌ మరో కూతురు అడ్డుపడి చేతిలోని చీపురుని పట్టుకుంది. మన్‌సుఖ్‌ ఆమెనుంచి బలవంతంగా చీపురును విడిచిపించుకుని తల్లిపై ఓ దెబ్బ వేశాడు. ఆ వెంటనే అతడి భార్య, కూతురు వృద్ధురాలిని అక్కడే ఉన్న ఓ గదిలోకి తీసుకెళ్లిపోయారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ కావటంతో నెటిజన్లు మన్‌సుఖ్‌ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేయటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు అతడ్ని, అతడి కుమార్తెను అదుపులోకి తీసుకున్నారు. ఒక వేళ సదరు వృద్ధురాలు అతడిపై కేసు పెట్టదల్చుకుంటే కేసు నమోదు చేస్తామని.. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, వృద్ధురాలు కోరుకుంటే ఆమెను వృద్ధాశ్రమంలో చేర్చుతామని జిల్లా ఎస్పీ ఎస్‌ఆర్‌ ఒడెదరా తెలిపారు.

చదవండి : నెటిజన్లను మెప్పిస్తున్న పెంగ్విన్లు: వైరల్‌ వీడియో

మరిన్ని వార్తలు