వైరల్‌: పాక్కుంటూ వెళ్లి అడ్డంగా బుక్కైన కరెంట్‌ దొంగోడు

15 Jul, 2021 10:03 IST|Sakshi

కొంతమంది పవర్‌ బిల్‌ కట్టకుండా ఎగ్గొట్టేందుకు నానా వేషాలు వేస్తుంటారు. అధికారులకు తెలియకుండా పోల్‌ నుంచి దొంగతనంగా వైర్లను ఏర్పరుచుకొని కరెంట్‌ వినియోస్తుంటారు. చదువుకోని వారు, అవగాహన లేని వాళ్లే ఇలాంటి దొంగ పనులు చేస్తారనుకుంటే పొరపాటే. చదువుకున్నవారు సైతం తెలివిగా కరెంట్‌ దొంగతనాలు చేయడానికి అలవాటుపడుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి అచ్చం ఇలాగే విద్యుత్ చౌర్యానికి అలవాటుపడి మూడో కంటికి తెలియకుండా కరెంట్‌ వాడుకునేవాడు.

రోజంతా అక్రమంగా విద్యుత్‌ వినియోగించుకుంటూ అధికారులు పర్యవేక్షించడానికి వచ్చినప్పుడు మాత్రం వెంటనే కరెంట్‌ వైర్లను కట్‌ చేసి తమకు ఏం తెలియదన్నట్లు నటించేవాడు. అయితే విద్యుత్ దొంగతనం జరుగుతుందని ఫిర్యాదు అందడంతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ విషయంపై విచారించడానికి అక్కడికి వెళ్లారు. అధికారుల రాకను గమనించిన వ్యక్తి వెంటనే బాల్కనీపైకి మెల్లగా పాకుతూ వెళ్లి అక్కడున్న లింక్‌వైర్‌ను కట్‌ చేయబోయాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్‌ నెలకొంది.

టెర్రస్ మీద ఉన్న మెట్లపై ఇటుక రాళ్లతో కప్పి ఉన్న జాయింట్ వైర్లు కట్‌ చేస్తున్న క్రమంలో అప్పటికే ఓ అధికారి టెర్రస్‌ మీదకు వెళ్లి ఇదంతా వీడియో తీస్తున్నాడు. వ్యక్తిని గమనిస్తూ వీడియో తీస్తున్న ఎలక్ట్రిసిటీ అధికారి ‘బ్రదర్.. నేనిక్కడే నిల్చొన్నా’ అంటూ బదులిచ్చాడు. ఆ మాట విని అయ్యో దొరికిపోయానా అనే రేంజ్‌లో కరెంట్ దొంగ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చాడు. ఇక దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా యూపీలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా నమోదవుతుండటంతో వీటి కోసం పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

>
మరిన్ని వార్తలు