సరదాకు చేసిన ఫీట్‌ ప్రాణాల మీదకు తెచ్చింది.. కేసు నమోదు.. వీడియో వైరల్‌

23 May, 2022 12:26 IST|Sakshi

సరదాకు చేసిన ఓ ఫీట్‌ యువకుడిని ఆసుపత్రిపాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చింది. పోలీసులు హెచ్చరించినా వినిపించుకోకపోవడంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. ఇటీవల కర్నాటకలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు పొర్లిపొంగాయి. ఈ క్రమంలో చిక్కబళ్లాపూర్‌లోని శ్రీనివాస సాగర డ్యామ్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో డ్యామ్‌ వద్ద ఉన్న గోడపై నుంచి డ్యామ్‌ నీళ్లు కిందకు వస్తున్నాయి. వేసవిలో దీన్ని చూసేందుకు స్థానికులు భారీ సంఖ‍్యలో అక్కడికి చేరుకుని ఎంజాయ్‌ చేస్తున్నారు. 

ఈ క్రమంలో ఓ యువకుడు(20) పై నుంచి నీళ్లు వస్తున్న సమయంలో సరదాకు ట్రెక్కింగ్‌ చేయబోయాడు. అతడు దాదాపు 25 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత పట్టుజారి పోవడంతో కింద పడిపోయాడు. కాగా, ఆనకట్ట దాదాపు 50 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. ఈ ప్రమాదంలో గాయపడిన యువకుడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. ప్రమాదకర ఫీట్ చేయవద్దని జిల్లా యంత్రాంగం హెచ్చరించినా పట్టించుకోకుండా యువకుడి ఇలా చేయడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇది కూడా చదవండి: మోదీని సర్‌ప్రైజ్‌ చేసిన బాలుడు.. ఆశ్యర్యపోయిన ప్రధాని

మరిన్ని వార్తలు