కాన్పూర్: లోదుస్తువు (అండర్వేర్) దొంగలించి సరదాగా వేసుకుని మిత్రుడిని ఆటపట్టిద్దామని భావించగా అది కాస్త అతడి ప్రాణం మీదకు వచ్చింది. అండర్వేర్ వేసుకున్నాడనే కోపంతో గొడవ జరిగి చివరకు ఆ యువకుడి హత్యకు దారి తీసింది. సరదాగా జరిగిన వాగ్వాదం కాస్త చివరకు కత్తితో పొడుచుకునే వరకు వెళ్లింది. క్షణికావేశంలో జరిగిన ఆ వాగ్వాదంలో ఓ యువకుడి ప్రాణం పోయి స్థాయికి చేరింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కాన్పూర్ దేహక్ జిల్లాలోని ఓ పారిశ్రామిక వాడలో అజయ్ కుమార్, వివేక్ శుక్లా ఒకే గదిలో ఉంటున్నారు.సరదాగా అజయ్ను ఆట పట్టిద్దామనే ఉద్దేశంతో వివేక్ అతడి అండర్వేర్ దొంగతనం చేశాడు. అయితే గదిలో అండర్వేర్ కోసం వెతకగా అజయ్కు కనిపించలేదు. దీంతో వివేక్ను అడగ్గా.. తాను వేసుకున్నానని వివేక్ సరదాగా ఆట పట్టించాడు. అయితే అజయ్ కోపంతో అతడితో వాగ్వాదం చేశాడు. ఈ సమయంలో కోపోద్రిక్తుడైన అజయ్ క్షణికావేశంలో కూరగాయలు కోసే కత్తితో వివేక్ను పొడిచాడు.
పలుసార్లు పొడవడంతో వివేక్ తీవ్ర గాయాలపాలయ్యాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో భయాందోళన చెందిన అజయ్ వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న తోటి కార్మికులు వెంటనే స్పందించి అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు లాలా లజపతిరాయ్ ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.