నాలుగేళ్ల క్రితం హత్య.. రూ. 5 కోట్ల రివార్డు.. ఢిల్లీ పోలీసులకు చిక్కిన ఆస్ట్రేలియాలో మోస్ట్ వాంటెడ్!

25 Nov, 2022 13:37 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో మోస్ట్‌ వాంటెడ్‌ నిందితుడిని ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియా బీచ్‌లో జరిగిన ఓ యువతి హత్య కేసులో నిందితుడుగా ఉన్న రాజ్వేందర్‌ సింగ్‌ను(38) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2018 ఆక్టోబర్‌ 21న క్వీన్స్‌లాండ్‌ బీచ్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా 24 ఏళ్ల తోయా కార్డింగ్లీ యువతి హత్యకు గురైంది. బీచ్‌ మర్డర్‌ కేసుగా ఈ ఘటన ఆ దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్‌విందర్‌ సింగ్‌ హత్య చేసిన రెండు రోజులకే దేశం విచిడి పారిపోయాడు. ఉన్నపళంగా ఉద్యోగం, భార్య, ముగ్గురు పిల్లలను వదిలి భారత్‌కు చెక్కేశాడు.

పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌లోని బటర్ కలాన్‌కు చెందిన రాజ్‌ విందర్‌ ఆస్ట్రేలియాలోని ఇన్నిస్‌ ఫైల్‌ టౌన్‌లో నివసించేవాడు. అక్కడే నర్సింగ్‌ అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. ఆస్ట్రేలియా నుంచి పారిపోయి వచ్చిన తర్వాత అతడు పంజాబ్‌లో తలదాచుకున్నాడు. అప్పటి నుంచి ఆస్ట్రేలియన్‌ పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. 2021 మార్చి నెలలో రాజ్‌విందర్‌ సింగ్‌ను అప్పగించాలని ఆస్ట్రేలియా భారత్‌ను కోరింది. అదే ఏడాది నవంబర్‌లో భారత్‌ అందుకు అంగీకరించింది.

కొన్ని వారాల క్రితం రాజ్‌ విందర్‌పై క్వీన్స్‌లాండ్‌ పోలీసులు భారీ రివార్డు ప్రకటించారు. నిందితుడిని ఆచూకీ తెలిపిన వారికి 1 మిలియన్‌ ఆస్ట్రేలియన్‌ డాలర్లు( భారత్‌ కరెన్సీలో దాదాపు 5 కోట్లు) నజరానా ప్రకటించారు. దీంతో ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారింది. కాగా క్వీన్స్‌లాండ్‌ పోలీసులు ప్రకటించిన అత్యంత భారీ రివార్డు ఇదే. ఆస్ట్రేలియా అధికారులు, భారత్‌ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఇందు కోసం పంజాబీ, హిందీ మాట్లాడే అయిదుగురు పోలీస్‌లను ఆస్ట్రేలియన్‌ ప్రభుత్వం నియమించింది. ఫలితంగా నిందితుడు పోలీసులకు చిక్కాడు.
చదవండి: Video: చిన్నారిపై అత్యాచారం.. నిందితుడికి ఐదు గుంజీల శిక్ష

మరిన్ని వార్తలు