దేశ రాజధానిలో మంకీపాక్స్‌ అలజడి.. మరో వ్యక్తిలో లక్షణాలు!

27 Jul, 2022 09:28 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో మంకీపాక్స్‌ వైరస్‌ అలజడి సృష్టిస్తోంది. ఇప్పటికే నలుగురిలో ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కాగా.. తాజాగా ఢిల్లీలో ఓ వ‍్యక్తిలో లక్షణాలు బయటపడ్డాయి. మంకీపాక్స్‌ లక్షణాలతో బాధితుడు మంగళవారం సాయంత్రం.. ఢిల్లీలోని లోక్‌నాయక్‌ జై ప్రకాశ్‌ నారాయణ్‌ ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ వైరస్‌ మాదిరిగానే చర్మంపై బొబ్బలు, తీవ్ర జ్వరం వంటివి కనిపించాయన్నారు. నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించామని చెప్పారు. 

34 ఏళ్ల బాధితుడు ఇటీవలే హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో నిర్వహించిన ఓ పార్టీకి హాజరయ్యాడు. ఆ తర్వాత జ్వరం, చర‍్మంపై దద్దుర్ల వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. దేశంలో మొత్తం నాలుగు కేసులు రాగా.. కేరళలో మూడు, ఢిల్లీలో ఒక కేసు వచ్చింది. మూడు రోజుల క్రింత జులై 24న ఢిల్లో తొలి కేసు నమోదైంది. ఆ వ్యక్తి సైతం ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిని నోడల్‌ సెంటర్‌గా ప్రకటించింది ఢిల్లీ ప్రభుత్వం. వైద్యులకు శిక్షణ ప్రారంభించింది. 

రాష్ట్రాలు అప్రమత్తం.. 
దేశంలో మంకీపాక్స్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వైరస్‌ కట్టడికి చర్యలు చేపట్టాయి. మంకీపాక్స్‌ కేసులు బయటపడిన దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులను ఎయిర్‌పోర్ట్‌లోనే పరీక్షలు నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. కోవిడ్‌ ఆసుపత్రుల్లో మంకీపాక్స్‌ కోసం ప్రత్యేక పడకలను ఏర్పాటు చేయాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మంకీపాక్స్‌ ను జులై 23న అంతర్జాతీయ అత్యవసర ఆరోగ్య పరిస్థితిగా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

ఇదీ చదవండి: ఆర్మీ జవాన్‌కు పాక్‌ మహిళల ‘హనీట్రాప్‌’.. సైనిక రహస్యాలు లీక్‌!

మరిన్ని వార్తలు