సెల్‌ఫోన్లకు ఫ్రీ బీర్లు ఆఫర్‌.. ఎగబడ్డ జనం.. వ్యాపారి అరెస్ట్‌

7 Mar, 2023 07:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

క్రైమ్‌: స్మార్ట్‌ఫోన్‌ కొంటే బీర్లు ఫ్రీ అని అనౌన్స్‌ చేశాడు. ఊరంతా పోస్టర్లు అంటించి.. పాంప్‌లెట్స్‌ పంచాడు. ఆ ప్రకటనతో ఒక్కసారిగా ఆ సెల్‌ఫోన్‌ దుకాణం ముందు జనం ఎగబడ్డారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతో పాటు అక్కడ రచ్చ  రచ్చ చేశారు. ఇది కాస్త పోలీసుల దాకా చేరింది. రంగ ప్రవేశం చేసి ఆ బంపరాఫర్‌ ప్రకటించిన వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. 

యూపీ భదోహిలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. చౌరీ రోడ్‌లో రాజేశ్‌ మౌర్య అనే వ్యక్తి సెల్‌ఫోన్‌ల షాప్‌ నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో తన దుకాణంలో మార్చి 3 నుంచి 7వ తేదీల మధ్య సెల్‌ఫోన్‌ కొంటే రెండు బీర్‌ క్యాన్లు ఇస్తానని ప్రకటించాడు. సెంటర్‌లలో పోస్టర్లు అతికించి, పాంప్‌లెట్స్‌ పంచాడు. దీంతో కస్టమర్లు ఒక్కసారిగా ఎగబడ్డారు.

ట్రాఫిక్‌కు విఘాతం కలిగింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి గుంపును చెదరగొట్టారు. ఐపీసీ సెక్షన్‌ 151 (ప్రజాశాంతికి విఘాతం కలిగించడం) నేరం కింద మౌర్యను అరెస్ట్‌ చేసి, దుకాణాన్ని సీల్‌ చేశారు. 
 

మరిన్ని వార్తలు