11కేవీ హైఓల్టేజ్‌ కరెంట్‌ తీగలపై స్టంట్స్‌.. తర్వాత ఏం జరిగిందంటే?

28 Sep, 2022 17:55 IST|Sakshi
విద్యుత్తు తీగలపై వేలాడుతున్న నౌషద్‌

లక్నో: మన ఇంట్లోని సింగిల్‌ పేస్‌ కరెంట్‌ షాక్‌ తగిలితేనే ప్రాణాలు పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాంటి 11 కేవీ విద్యుత్తు వైర్లను తాకితే ఏమైనా ఉందా? స్పాట్‌లోనే మాడి మసైపోతాం. కానీ, ఓ వ్యక్తి ప్రమాదకర సహసానికి పూనుకున్నాడు. 11కేవీ విద్యుత్తు తీగలపై స్టంట్స్‌ చేస్తూ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిలిభిత్‌ నగరంలో జరిగింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

సెప్టెంబర్‌ 24న నగరంలోని అమారియా ప్రాంతంలో నౌషద్‌ అనే వ్యక్తి ఈ ప్రమాదకర సాహసం చేశాడు. ఇళ్ల పైకప్పుపైకి ఎక్కి విద్యుత్తు తీగలపైకి చేరుకున్నాడు. ఊయల మాదిరిగా ఊగుతూ అందరిని షాక్‌కు గురిచేశాడు. అయితే.. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విద్యుత్తు సరఫరా నిలిపివేయటం.. అతడికి అదృష్టంగా మారింది. లేకపోతే.. కాలి బూడిదయ్యేవాడు. హైఓల్టేజ్‌ తీగలపై వేలాడుతున్న వ్యక్తిని చూసిన కొందరు వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌ను అలర్ట్‌ చేశారు. విద్యుత్తు సరఫరా ప్రారంభించవద్దని సూచించారు. వెంటనే అక్కడికి చేరుకున్న విద్యుత్తు అధికారులు.. నౌషద్‌ను బలవంతంగా కిందకు దించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వారితో పంపించారు. నౌషద్‌ ప్రస్తుతం బండిపై గాజులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నట్లు గుర్తించారు. అయితే, ఇలా ఎందుకు చేశాడో నౌషద్‌ చెప్పలేదు. అప్పుడప్పుడు ఇలా ప్రవర్తిస్తుంటాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఇదీ చదవండి: Viral Video:రాహుల్‌ని చూసి భావోద్వేగం.. వెక్కి వెక్కి ఏడ్చిన యువతి: వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు