భార్యపై కిరాతకం.. ట్రైన్‌ కింద తోసేసి పిల్లలతో పరారైన భర్త

23 Aug, 2022 12:22 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైకి సమీపంలోని వసాయి రైల్వే స్టేషన్‌లో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. పిల్లలతో నిద్రిస్తున్న మహిళను లాక్కెళ్లి వేగంగా దూసుకొస్తున్న ట్రైన్‌ కింద తోసేశాడు ఓ కిరాతక భర్త. ఆ తర్వాత తన ఇద్దరు పిల్లలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో నమోదైన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మహిళను ట్రైన్‌ కింద తోసేసిన సంఘటన సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది.

వీడియోలో.. ప్లాట్‌ఫామ్‌పై ఉ‍న్న బల్లపై తన పిల్లలతో బాధితురాలు పడుకుని ఉంది. అక్కడికి వచ్చిన వ్యక్తి ఆమెను నిద్రలేపాడు. ఆ తర్వాత కొద్దిసేపు ఇరువురు మాట్లాడుకున్నారు. ట్రైన్‌ వస్తుండడాన్ని గమనించి.. అకస్మత్తుగా మహిళను లాక్కెళ్లి రైల్వే ట్రాక్‌పై తోసేశాడు. దాంతో ఆమె పైనుంచి అవాధ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు దూసుకెళ్లింది. మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఇద్దరు కుమారులతో అక్కడి నుంచి పరారయ్యాడు నిందితుడు. వారు ఇరువురు ఆదివారం మధ్యాహ్నం నుంచి స్టేషన్‌లోని ఉన్నట్లు గుర్తించారు రైల్వే పోలీసులు. ఈ ఘటన జరిగిన తర్వాత నిందితుడు దాదర్‌ వెళ్లాడని, అక్కడి నుంచి కల్యాన్‌ ప్రాంతానికి వెళ్లినట్లు చెప్పారు. థానేలోని బీవండి నగరంలో అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: ‘రియల్‌ హీరో’.. పిల్లలతో విధులకు జొమాటో డెలివరీ బాయ్‌

మరిన్ని వార్తలు