మణిపూర్‌లో హైటెన్షన్‌..144 సెక్షన్‌ విధింపు

28 Apr, 2023 10:00 IST|Sakshi

మణిపూర్‌లోని చురాచంద్‌పూర్‌ జిల్లా తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ముఖ్యమంత్రి ఎన్‌ బీరేన్‌ సింగ్‌ పర్యటనకు ముందు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. గురువారం రిజర్వ్‌ చేసిన రక్షిత అడవులు, చిత్తడి నేలలు, వంటి ప్రాంతాలపై బీజేపీ ప్రభుత్వం చేసిన సర్వేని ఆదివాసి గిజన నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి షెడ్యూల్‌ కార్యక్రమానికి చెందిన వేదికను ఓ గుంపు ధ్వంసం చేసి, నిప్పంటించారు.

దీంతో అధికారులు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనులు తలెత్తకుండా 144 సెక్షన్‌ని విధించి నిషేధాజ్ఞాలు జారీ చేశారు. ఉద్రిక్తతలు మరింతగా చెలరేగేలా..ప్రజలు ఎవరితోనూ కమ్యూనికేట్‌ చేయకుండా ఉండేందుకు ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశారు. ప్రజల ప్రాణలు, ఆస్తులకు తీవ్ర ప్రమాదం ఉందని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తాము శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఉండేలా  ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చురాచంద్‌పూర్ జిల్లా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఎస్ థియెన్‌లట్‌జోయ్ గాంగ్టే ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

బీజేపీ ప్రభుత్వం  చేసిన సర్వేను ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే జిల్లాలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జిల్లా బంద్‌కు గిరిజన నాయకుల ఫోరం పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రైతులు, ఇతర గిరిజన నిర్వాసితులు రిజర్వు అటవీ ప్రాంతాలను తొలగించడం కోసం కొనసాగుతున్న డ్రైవ్‌ను నిరసిస్తూ ప్రభుత్వానికి పదేపదే మెమోరాండంలు సమర్పించారు. అయినప్పటికీ తమ కష్టాలను పరిష్కరించడంలో ప్రభుత్వం సుముఖత లేదా చిత్తశుద్ధి చూపలేదని గిరిజన నాయకుల ఫోరం పేర్కొంది.  ఈమేరకు  కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కూడా ఫోరమ్‌కు మద్దతుగా నిలిచింది.

ఆదివాసులపై ప్రభుత్వం సవతి తల్లి మాదిరిగా ప్రవర్తిస్తుందిన కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆరోపించింది.  మత కేంద్రాలను కూల్చివేయడం, గిరిజన గ్రామాలను అక్రమంగా తొలగించడం వంటి వాటితో  గిరిజన హక్కులను నిర్వీర్యం చేస్తుందని, దీన్ని తాము ఖండిస్తున్నట్లు ఆర్గనైజేషన్‌ పేర్కొంది. కాగా, మణిపూర్‌లోని మూడు చర్చిలను ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో కూల్చివేసి, వాటిని అక్రమ నిర్మాణాలుగా పేర్కొనడం గమనార్హం. 

(చదవండి: ఐఏఎస్‌ ఆఫీసర్‌ నిర్వాకం..స్మారక కట్టడాన్ని కూల్చి బంగ్లాగా..)

మరిన్ని వార్తలు