ఎన్నికల రాష్ట్రంలో వరుస గ్రెనేడ్ దాడులు

20 Jan, 2022 15:50 IST|Sakshi

ఇంఫాల్: అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మణిపూర్‌లో వరుస గ్రెనేడ్ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీపీ) మద్దతుదారుడు లోకెన్ సింగ్ ఇంటిపైకి దుండగులు గ్రెనేడ్ విసిరారు. కైరావ్ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని ఇరిల్‌బంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరాప్తి అవాంగ్ లీకైలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. గ్రెనేడ్‌ పేలుడులో లోకెన్‌ సింగ్‌ 27 ఏళ్ల కుమారుడి కుడి కాలికు గాయాలయ్యాయని వెల్లడించారు.

డీజీపీ, సీనియర్‌ పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దర్యాప్తు మొదలు పెట్టామని, గ్రెనేడ్ దాడికి పాల్పడిన వారిని గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని లోకెన్ కుటుంబీకులు చెప్పారు. ఇటీవల తమ ఇంటి ఆవరణలో బీజేపీ జెండా పెట్టేందుకు అనుమతించలేదని వారు వెల్లడించారు. మరోవైపు గ్రెనేడ్‌ దాడిని ఖండిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. (చదవండి: పొలిటికల్‌ సిద్ధూయిజం: క్రికెట్‌లో అజారుద్దీన్‌నీ వదల్లేదు..)

ఇంఫాల్‌ పశ్చిమ జిల్లాలోని జనవరి 9న జరిగిన మరో ఘటనలో ఇండియా రిజర్వ్ బెటాలియన్(ఐఆర్‌బీ) పనిచేస్తున్న వ్యక్తితో పాటు బీజేపీ కార్యకర్త హత్యకు గురయ్యారు. కాంగ్రెస్‌ నేతల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఇంఫాల్‌ తూర్పు, పశ్చిమ జిల్లాల్లో జనవరి 13న అరగంట వ్యవధిలో రెండు గ్రెనేడ్‌ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఎవరూ గాయపడనప్పటికీ, ఆస్తి నష్టం సంభవించింది. (చదవండి: ఆ రోజు వద్దు.. మరో రోజు పోలింగ్‌ పెట్టండి ప్లీజ్‌)

మరిన్ని వార్తలు