సెలవు కోరుతున్న రాజ్యసభ ఎంపీలు

16 Sep, 2020 10:30 IST|Sakshi

ఢిల్లీ : సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు ఎవరిని వదలకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా సెగ పార్లమెంట్‌కు కూడా గట్టిగానే తగిలింది. ఇప్పటికే 25 మంది ఎంపీలు సహా 50 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడం అలజడి రేపింది. కాగా సెప్టెంబర్‌ 12న ప్రారంభమైన పార్లమెంట్‌ సమావేశాలకు ముందే లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు కరోనా పరీక్షలు నిర్వహించగా 17 మంది లోక్‌సభ, 8 మంది రాజ్యసభ ఎంపీలకు వైరస్‌ సోకినట్లు నిర్థారణ అయింది. (చదవండి : ప్రశ్నోత్తరాలు రద్దు, జీరో అవర్‌ అరగంటే)

దీంతో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సహా 14 మంది రాజ్యసభ ఎంపీలు తమకు సెలవులు కావాలంటూ దరఖాస్తు చేసుకోవడం ఆసక్తి కలిగించింది. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు తమకు సెలవులు ఇవ్వాలంటూ ఎంపీలు తమ దరఖాస్తులో కోరారు. కాగా కోవిడ్‌-19 విసృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాజ్యసభ ఎంపీలు సెలవులు కోరినట్లు సమాచారం. కాగా కరోనా బారిన పడినవారిలో బీజేపీకి చెందినవారు అత్యధికంగా 12 మంది ఎంపీలుండగా.. వైఎస్సార్‌సీపీ నుంచి అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, శివసేన, డీఎంకే, ఆర్‌ఎల్‌పీ తదితర పార్టీలకు చెందిన పలువురు ఎంపీలు ఉన్నారు. కోవిడ్‌ 19 పాజిటివ్‌గా తేలిన ఎంపీలు కొందరు క్వారంటైన్‌లో ఉండగా.. మరికొందరు ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. 

మరిన్ని వార్తలు