మాస్క్‌ లేదు.. నా భర్తను ముద్దు పెట్టుకుంటా, ఆపగలవా?

19 Apr, 2021 11:25 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ అ‍త్యంత వేగంగా వ్యాపిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. భారీగా కేసులు నమోదవుతుంటడంతో నిబంధల్ని కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోనే వారాంతపు లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే ఓ జంట మాత్రం లాక్‌డౌన్‌ రూల్స్‌ పాటించకుండా చక్కర్లు కొడుతూ, మాస్క్‌ లేదని అడిగిన పోలీసులకు వింతగా సమాధానమిచ్చారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని దరియాగంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మాస్క్‌ పెట్టుకోవాలి అన్నందుకు హల్‌చల్‌
లాక్‌డౌన్‌ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు మాస్కు లేకుండా కారులో వెళ్తున్న ఓ జంటను ఆపారు. కారులో వెళ్తున్నా కూడా మాస్క్ ధరించాలని సూచించారు. కర్ఫ్యూ సమయంలో తిరుగుతున్నందుకు పాస్‌ ఉండాలని చెప్పారు. దీంతో కారులోంచి బయటకు వచ్చిన మహిళ పోలీసులపై రెచ్చిపోయారు. ‘నాకు మాస్క్‌ లేదు.. అయితే నా భర్తను ముద్దు పెట్టుకుంటా.. నన్ను ఆపగలవా’ అంటూ పోలీసులనే ఎదురు ప్రశ్నించింది. అనంతరం ఆమె భర్త కూడా నా కారు ఎందుకు ఆపావు అంటూ పోలీసుల మీద ఫైర్‌ అయ్యాడు. నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా. విధుల్లో పోలీసులతో దురుసుగా మాట్లాడినందుకు ఆ జంటపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, కారు ఆపినందుకు ఆ జంట చేసిన హల్‌చల్  ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

కొద్ది రోజులుగా ఢిల్లీలో అత్యధిక సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే దేశ రాజధానిలో 25వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత వారం సీఎం కేజ్రీవాల్ కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి వీకెండ్ లాక్ డౌన్ ను తీసుకొచ్చారు. వారంతపు లాక్‌డౌన్‌లో కోవిడ్ రూల్స్‌ ఉల్లంఘించినందుకు గానూ 569పై ఎఫ్ఐఆర్‌లు, 2,369 మందికి చలాన్లు విధించారు ఢిల్లీ పోలీసులు. 

( చదవండి: పదునెక్కిన కరోనా కోరలు )

మరిన్ని వార్తలు