తమిళనాడు: మహిళా ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌

15 Aug, 2021 19:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై: మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు తమిళనాడు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆయా ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలకు ప్రసూతి సెలవుల సంఖ్యను పెంచనున్నట్లు ప్రకటించింది. మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవులను ఏడాడి కాలం పాటు పొడగిస్తున్నట్లు ఆర్థికమంత్రి పళనివేల్ త్యాగరాజన్ శుక్రవారం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో పేర్కొన్నారు. ఇక, ప్రస్తుతం రాష్ట్రంలో మహిళా ప్రభుత్వం ఉద్యోగలు 9 నెలల ప్రసూతి సెలవులు పొందుతున్న విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో మహిళా ఉద్యోగులు  ఏడాది పాటు ప్రసూతి సెలువులు పొందనున్నారు. డీఎంకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో హామీల్లో ప్రసూతి సెలవుల పెంపు ఒకటని మంత్రి పేర్కొన్నారు.

ప్రభుత్వం తీసుకున్న ప్రసూతి సెలవుల పెంపుతో.. తల్లుల ఆర్యోగం మెరుగుపడుతుందని, మొదటి ఆరు నెలల పాటు శిశువులకు తల్లి పాలు సమృద్ధిగా అందుతాయని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వం మాతా, శిశువులకు ఉచిత వ్యాక్సినేషన్‌, పోషకాహారం అందిస్తోంది.

కానీ, చాలా మంది తల్లులకు సరైన సమయం లభించకపోవటంతో వారి ఆరోగ్యం, శిశువుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపలేకపోతున్నారని అధికారులు తెలిపారు. పొడగించిన ప్రసూతి సెలవులతో మాతా, శిశువుల ఆరోగ్యం విషయంలో మంచి ఫలితాలుంటాయని పేర్కొన్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా సీఎం ఎం.కే స్టాలిన్‌.. తమ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని తెలిపారు.

మరిన్ని వార్తలు