జ్ఞానవాపి తరహాలోనే.. శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై మధుర కీలక తీర్పు

24 Dec, 2022 15:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా కేసు వివాదంలో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లోని మధురు స్థానిక కోర్టు Mathura Court కీలక తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలంలో సర్వే చేపట్టాలని కోర్టు అమిన్‌కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జనవరి 20వ(2023) తేదీలోగా సర్వే పూర్తి చేసి.. ఆ నివేదికను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. 

జనవరి 2వ తేదీ తర్వాత నుంచి ఈ సర్వేను చేపట్టాలని ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు సూచించింది. షాహీ ఈద్గాలో ఉన్న 13.37 ఎకరాలు తమకు అప్పగించాలని హిందూ సంఘాలు పిటిషన్‌ దాఖలు చేశాయి. హిందూ సేన దాఖలు చేసిన పిటిషన్‌ ఆధారంగా కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలకు ఇరు పక్షాలు కట్టుబడి ఉండాలని స్పష్టం చేస్తూ.. నోటీసులు జారీ చేసింది. 

అది కృష్ణ జన్మస్థలమని, మొగలు చక్రవర్తి ఔరంగజేబ్‌ అక్కడున్న ఆలయాన్ని కూల్చేయించి.. ఈద్గా కట్టించాడని హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా, ఉపాధ్యక్షుడు సుర్జిత్‌ సింగ్‌ యాదవ్‌లు వాదిస్తున్నారు. అంతేకాదు 1968లో శ్రీకృష్ణ జన్మస్థాన సేవా సంఘ్‌కు, షాహీ మసీద్‌ ఈద్గాకు మధ్య జరిగిన ఒప్పందాన్ని సైతం వీళ్లు న్యాయస్థానంలో సవాల్‌ చేశారు.  

ఇదిలా ఉంటే.. జ‍్క్షానవాపి మసీద్‌ కేసులోనూ వారణాసి కోర్టు ఇదే తరహాలో వీడియోగ్రాఫిక్‌ సర్వేకు ఆదేశించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు