‘యూపీ సర్కార్‌ రామరాజ్య సూత్రాలను పాటించడం లేదు’

22 Aug, 2020 18:39 IST|Sakshi

లక్నో: యూపీలోని యోగి ఆదిత్యనాథ్‌‌ ప్రభుత్వం రామరాజ్య సూత్రాలను పాటించడం లేదని  బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత మాయావతి శనివారం విమర్శించారు. మాయావతి మాట్లాడుతూ.. బీజేపీ కులతత్వ రాజకీయాల వల్ల బ్రాహ్మణులు బీఎస్పీలో చేరుతున్నారని తెలిపారు. యూపీలో అసెంబ్లీ ఎన్నికలు 2022సంవత్సరంలో జరగనున్న విషయం తెలిసిందే. కాగా బ్రాహ్మణులను బీఎస్పీ పట్టించుకోవడం లేదని బీజేపీ ఆరోపించడంపై మాయావతి స్పందిస్తూ.. తాము అధికారంలో ఉన్నప్పుడు బ్రాహ్మణులకు ప్రాముఖ్యత కలిగిన మంత్రిత్వ శాఖలను బీఎస్పీ కేటాయించిందని గుర్తు చేశారు. కాగా, బ్రాహ్మణ సమాజం అర్థం లేని ఆరోపణలను నమ్మరని తెలిపారు.

కాగా మాయావతి 2007 సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల గెలుపు వ్యూహాన్నే అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ బ్రాహ్మణ వర్గాన్ని ఆకట్టుకొని భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. యూపీలో 11శాతం బ్రాహ్మణుల జనాభా ఉంది. పార్టీల గెలుపోటమలలో బ్రాహ్మణులు కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా 2017అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ హిందుత్వ నినాదంతో 403 అసెంబ్లీ స్థానాలకు గాను 312స్థానాలను కైవసం చేసుకున్నారని విశ్లేషకులు తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ కేవలం పది స్థానాలతో దారుణ ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే.
చదవండి: ఇంటర్నెట్‌ సెలబ్రిటిగా సీఎం పెంపుడు కుక్క

మరిన్ని వార్తలు