రేపటి నుంచి టోల్‌ వడ్డన

31 Aug, 2020 06:58 IST|Sakshi

సాక్షి, చెన్నై: సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోని టోల్‌గేట్లలో చార్జీల వడ్డనకు చర్యలు చేపట్టారు. అయితే, వాహనదారులు, లారీ యజమానులు ఈ వడ్డనను వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని జాతీయ రహదారుల్లో 48 చోట్ల టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ఆయా టోల్‌గేట్లు వాహనాలు దాటాలంటే, రుసుం చెల్లించాల్సిందే. ఈ టోల్‌గేట్లలో ఆరు నెలలకు ఓ సారి చార్జీల పెంపు ప్రక్రియ మొదటి నుంచి అమల్లో ఉంది. ఆ దిశగా ఆరు నెలల క్రితం 20 టోల్‌గేట్లలో ఐదు నుంచి పది శాతం మేరకు టోల్‌ వడ్డన సాగింది. దీనిని వాహన యజమాన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించే పనిలో పడ్డాయి. ఈ సమయంలో కరోనా లాక్‌డౌన్‌ అమలు కావడంతో రవాణా ఆగింది. ఆ తర్వాత సరకు రవాణా సాగడంతో టోల్‌ వసూళ్లను రద్దు చేశారు. క్రమంగా ఆంక్షల సడలింపులు, వాహనాలు రోడ్డెక్కడంతో మళ్లీ టోల్‌ వసూళ్లు మొదలయ్యాయి.

ఈ పరిస్థితుల్లో మిగిలిన 28 టోల్‌గేట్లలో ఐదు నుంచి పది శాతం మేరకు టోల్‌ పెంపునకు చర్యలు తీసుకున్నారు. సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుందన్న ప్రకటన ఆదివారం వెలువడింది. ఆ మేరకు ఒక్కో టోల్‌ గేట్లో వాహనదారులు ఇదివరకు చెల్లిస్తున్న మొత్తం కంటే అదనంగా రూ.5 నుంచి రూ.15 వరకు చెల్లించాల్సిన పరిస్థితి. అసలే కరోనా లాక్‌డౌన్‌ పుణ్యమా ఆర్థిక ఇబ్బందులు, కష్టాల్లో ఉన్న వాహనదారులకు ఈ టోల్‌ వడ్డన కొత్త భారంగా మారింది. లారీ, ట్రాన్స్‌పోర్టు యజమానుల సంఘాలు వడ్డనను తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ సమయంలో పెంపు సబబు కాదని, ఆరు నెలల పాటు టోల్‌ పెంపు వద్దని ఆ సంఘం నేత కుమారస్వామి డిమాండ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు