సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణ
న్యూఢిల్లీ: వివాదాలను పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వం ఉత్తమమైన మార్గమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. రాబోయే రోజుల్లోనూ మధ్యవర్తిత్వం పాత్ర మరింత పెరగడం ఖాయమని తెలిపారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మధ్యవర్తులు (మీడియేటర్స్) గురువారం నిర్వహించిన ఇంటర్నేషనల్ వర్చువల్ మీడియేషన్ సమ్మర్ స్కూల్–2021 కార్యక్రమం ‘నివారణ్’లో జస్టిస్ రమణ మాట్లాడారు.
బ్రిటిష్ పాలకులు ఆధునిక భారత న్యాయ వ్యవస్థకు రూపకల్పన చేయడమే కాకుండా, గొడవలను పరిష్కరించుకోవాలన్నా, న్యాయం పొందాలన్నా నల్ల కోట్లు, గౌన్లు, కోర్టుల్లో సుదీర్ఘ వాదోపవాదాలు అవసరమన్న అపోహను సైతం వారే సృష్టించారని పేర్కొన్నారు. అలాంటి అపోహలు, అభిప్రాయాలను దూరం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. చాలామంది కక్షిదారులు న్యాయం పొందే విషయంలో సామాజికంగా, ఆర్థికంగా అవాంతరాలు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. వివాదాల పరిష్కారానికి సరళమైన మార్గాన్ని వారు కోరుకుంటున్నారని తెలిపారు.