ఆర్టికల్‌ 370ని పునరుద్దరించేవరకు ఎన్నికల్లో పోటీ చేయను

26 Jun, 2021 10:39 IST|Sakshi

కీలక వ్యాఖ్యలు చేసిన మెహబూబా ముఫ్తీ

కశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్‌ 370, 35ఏని పునరిద్ధరించేవరకు తాను ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌ భవిష్యత్‌ ప్రణాళికపై చర్చించడానికి ఈ నెల 24న ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం ముఫ్తీ ఎన్నికలు, నియోజకవర్గాల పునర్వవస్థీకరణ కన్న ముందు ఈ ప్రాంత ప్రజల విశ్వాసం గెలవడం ముఖ్యం అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక హోదా, ఆర్టికల్‌ 370, 35ఏని పునరిద్ధరించే వరకు నా పోరాటం కొనసాగుతుంది.. అప్పటి వరకు నేను ఎన్నికల్లో పోటీ చేయను. నా పార్టీ పీడీపీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. సీఎం అభ్యర్థులకు కొరత లేదు’’ అన్నారు. 

‘‘మా పార్టీ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది.. దాని ప్రకారమే నడుచుకుంటుంది. అందుకే ప్రధాని ఆహ్వానం మేరకు మేం ఢిల్లీ వచ్చి.. మోదీతో సమావేశం అయ్యాము. కానీ ప్రస్తుతం రాజకీయ పార్టీలతో సమావేశం కావడం ముఖ్యం కాదు. ప్రజలతో కలిసిపోయి.. వారిలో విశ్వాసం నింపాలి. వారి నమ్మకాన్ని గెల్చుకోవాలి. అందుకు తగిన చర్యలు తీసుకోవడం ముఖ్యం’’ అన్నారు మెహబూబా ముఫ్తీ. జమ్మూకశ్మీర్‌ భవిష్యత్‌ ప్రణాళికపై ఆక్కడి కీలక నేతలతో ప్రధానమంత్రి మోదీ గురువారం తన నివాసంలో దాదాపు మూడున్నర గంటల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్న నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ముగిసిన తరువాత అసెంబ్లీ ఎన్నికలుంటాయని ప్రధాని తెలిపారని పీపుల్స్‌ కాన్ఫెరెన్స్‌ నేత ముజఫర్‌ హుస్సేన్‌ బేగ్‌ వెల్లడించారు. 

చదవండి: కశ్మీర్‌ పార్టీల మల్లగుల్లాలు

>
మరిన్ని వార్తలు