మేము కాదు.. మీరే జాతి వ్యతిరేకులు: ముఫ్తీ

17 Nov, 2020 21:11 IST|Sakshi

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో అధికరణ 370,35(ఎ) పునరుద్దరణ కోసం కొత్తగా ఏర్పాటైన పీపుల్స్‌ అలయెన్స్‌ గుప్కర్‌ డిక్లరేషన్‌ కోసం పోరాటాన్ని జాతి వ్యతిరేకంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విమర్శించడంపై ఆ పార్టీ నేత మహబూబ ముఫ్తీ ట్విట్టర్‌లో స్పందించారు. దేశాన్ని రక్షించడంతో తామే(బీజేపీ) ముందున్నామని, తమ రాజకీయ ప్రత్యర్థులు దాంట్లో ఆమడ దూరంలో ఉంటారనే పాత ప్రచారాన్ని బీజేపీ ఇంకా కొనసాగిస్తుందన్నారు. లవ్‌ జిహాద్‌, తుక్డే తుక్డే గ్యాంగ్‌, గుప్కర్‌ డిక్లరేషన్‌లపై ప్రజల దృష్టిని మరల్చి నిరుద్యోగం, ద్రవ్యోల్భణం వంటి అంశాలను మరుగున పడేస్తున్నారని ట్వీట్‌ చేశారు. గత కొన్ని రోజులుగా కేంద్రానికి కశ్మీర్‌ పార్టీల నాయకులకి మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతన్న విషయం తెలిసిందే.  దాంట్లో భాగంగా జమ్మూ కశ్మీర్‌లో త్వరలో రెండో విడత జిల్లా అభివృద్ధి ఎన్నికలు జరగబోతున్న తరుణంలో బీజేపీ, పీపుల్స్‌ పార్టీపై నాయకులు ఇస్తున్న ప్రకటనలపై విమర్శలు ఎక్కు పెట్టింది. అయితే తమ పార్టీని ముఠాగా అభివర్ణించడాన్ని ఆమె తప్పు పట్టారు. పాత అలవాట్లను ఇంకా బీజేపీ కొనసాగిస్తోందని దుయ్యబట్టారు. (చదవండి: పాకిస్తాన్‌ వైపు భారీ నష్టం!)

మొదట భారత సార్వ భౌమత్వానికి తుక్డే తుక్డే గ్యాంగులతో ప్రమాదమని ప్రచారం చేశారు. ఇప్పుడు గుప్కర్‌ డిక్లరేషన్‌ కోసం పోరాడే మాలాంటి వాళ్లను జాతి వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాసిన రోజు నుంచి ఇప్పటి వరకూ లక్షల మంది ప్రజలు మరణించారని ట్వీట్‌ చేశారు. అధికారం కోసం బీజేపీ అనేక కూటమిలతో జట్టు కడుతుందని, అదే ఎన్నికల కోసం తాము పోరాడితే మాత్రం జాతి ప్రయోజనాలకి విరుద్ధమెలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. కశ్మీర్‌ నేతలు వరుసగా చేస్తున్న ప్రకటనలపై కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సోమవారం స్పందించారు. చైనా-పాక్‌ సాయంతో జమ్ముకాశ్మీర్‌లో అధికరణ 370 ని తిరగి పునరుద్ధరిస్తామని ఫరూక్‌ అబ్ధుల్లా వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్‌ పార్టీ వైఖరి ఏంటని నిలదీశారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ అయిన జట్టు కట్టవచ్చని వాటి జాతి వ్యతిరేకంగా కనిపించిన ఎజెండాపై మాత్రం బీజేపీ కచ్చితంగా ప్రశ్నిస్తుందన్నారు.

గుప్కర్‌ డిక్లరేషన్‌:
బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం 2019 ఆగస్ట్‌ 5న జమ్మూకాశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని (ఆర్టికల్‌ 370) రద్దు చేయడాని కంటే ఒక రోజు ముందు ఆరు పార్టీలు (కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, సీపీఎం, జమ్మూ కశ్మీర్‌ పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌, అవామీ నేషనల్‌ కాన్ఫరెన్స్)  కలిసి శ్రీనగర్‌లోని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధినేత ఫరూక్‌ అబ్దుల్లా ఇంటిలో సమావేశమయ్యారు. ఆ ఇల్లు గుప్కర్‌ రోడ్డులో ఉండటంతో దానిని గుప్కర్‌ డిక్లరేషన్‌గా పిలుస్తున్నారు. వీరి ప్రధాన డిమాండ్‌ కశ్మీర్‌లో తిరిగి నిబంధన 370 ని పునరుద్ధరణ.

మరిన్ని వార్తలు