రూ. 9. 99 కోట్లు.. ఆకతాయిల చర్య అంటున్న యూనివర్సిటీ

4 Aug, 2020 18:23 IST|Sakshi

లక్నో: ఓఎల్‌ఎక్స్‌లో ఎవరైనా మొబైల్ ఫోన్లు, బైకులు, ఫర్నిచర్ అమ్మకానికి పెడతారు. కానీ ఓ ప్రబుద్ధుడు మాత్రం ఏకంగా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఉన్న యుద్ధ విమానం మిగ్‌-23నే అమ్మకానికి పెట్టాడు. అది కూడా 9.99 కోట్ల రూపాయలకు. కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న ఈ విమానాన్ని అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయానికి 2009 లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) బహుమతిగా ఇచ్చింది. క్యాంపస్‌లో విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఐఏఎఫ్‌ దీన్ని యూనివర్సిటీకి ఇచ్చింది. (అమ్మకానికి పటేల్‌ విగ్రహం..!)

ఇంతటి చరిత్ర  కలిగిన ఈ మిగ్‌-23 యుద్ధ విమానాన్ని ప్రస్తుతం ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి ఉంచడంతో సంచలనం రేపుతోంది. ఎవరో కావాలనే యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బ తీయడానికి విమానం ఫోటోను ఓఎల్‌ఎక్స్‌లో పెట్టారని సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రొక్టార్ ప్రొఫెసర్ మహమ్మద్ వసీం అలీ మాట్లాడుతూ.. ‘మా యూనివర్సిటీకి చెందిన వారు ఎవరూ ఆ విమానాన్ని ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పెట్టలేదు. ఇది ఎవరో ఆకతాయిలు చేసిన పని’ అని తెలిపారు. ఈ విషయంపై తాము విచారణ చేపట్టామని, ఈ పని ఎవరు చేశారో తెలుసుకుని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వసీం అలీ వెల్లడించారు. అంతేకాక సదరు విమానం ఫొటోను వెబ్‌సైట్‌ నుంచి తీసేశామని తెలిపారు.

మరిన్ని వార్తలు