కరోనా సోకి విద్యాశాఖ మంత్రి మృతి

2 Aug, 2020 11:02 IST|Sakshi

లక్నో : దేశంలో కరోనా వైరస్‌ బీభత్సం సృష్టిస్తోంది. ఉత్తరప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి కమలా రాణిని కరోనా వైరస్‌ కబళించింది. ఇటీవల కరోనా వైరస్‌ బారినపడి ఆమె చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వంలో ఆమె సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కరోనాపై పోరులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ ఆమె ముందున్నారు. ఈ క్రమంలోనే జులై 18న అనారోగ్యం పాలైయ్యారు. వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి లక్నోలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి తుదిశ్వాస విడిచారు. మంత్రి మృతి పట్ల ముఖ్యమంత్రి యోగి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు ఓ మంత్రి కరోనాకు బలి కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

మరిన్ని వార్తలు