చట్టానికి ఎవరూ అతీతులు కారు: కంగనాకు కౌంటర్‌

24 Nov, 2021 20:06 IST|Sakshi

Minister Nawab Malik Counter To Kangana: మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి నవాబ్‌ మాలిక్‌  బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను ఉద్దేశిస్తూ "చట్టానికి ఎవరూ అతీతులు కారు" అంటూ ఘాటుగా విమర్శించారు. అయితే సిక్కులపై సామాజిక మాధ్యమంలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌పై పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ బాలీవుడ్‌ నటి కంగానా పై ఈ వ్యాఖ్యలు చేశారు.

(చదవండి: IT Raids: వామ్మో!...పైప్‌లైన్లో నోట్ల కట్టలు..!!)

అంతేకాదు కంగనా రైతు ఉద్యమాన్ని  ఉద్దేశపూర్వకంగానే ‘ఖలిస్తాన్‌’ఉద్యమం అని, సిక్కులను ఖలిస్తానీ టెర్రరిస్టులంటూ చేసిన వ్యాఖ్యలు ఆగ్రహం తెప్పించేలా ఉన్నాయన్నారు. పైగా ఆమె పై కేసు నమోదు చేసి చర్య తీసుకుంటే సరిపోదని ఆమెకు కేంద్రం గతేడాది ఇచ్చిన వై ప్లస్‌ భద్రతను కూడా తొలగించాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

అంతేకాదు కేంద్రం ఆమె తండ్రి అభ్యర్ధన మేరకు ఈ భద్రతను ఇచ్చిన సంగతిని కూడా గుర్తుచేశారు. గత కొన్ని రోజులుగా కంగనా ప్రతి ఒక్కరినీ దుర్భాషలాడుతున్న తీరు.. మన జాతిపిత (మహాత్మా గాంధీ)ని అవమానించడం.. ఆజాదీ (స్వాతంత్య్రం) నకిలీదని, మనం బిచ్చగాళ్లమని... వ్యాఖ్యలు చేసి ఆమె వివిధ వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిందంటూ నవాబ్‌ మాలిక్‌ మండిపడ్డారు. 

అయితే ప్రధాని నరేంద్ర మోదీ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవండతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేసిన తరుణంలో ‍కూడా కంగనా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద దూమారం లేపడమే కాక ఆమెకు అపఖ్యాతిని తెచ్చిపెట్టాయి. అంతేకాదు కంగనా చేస్తున్న ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు కారణంగానే మేలో ట్విటర్‌.. నిబంధనలను పదే పదే ఉల్లంఘించిదంటూ ఆమె ఖాతాను శాశ్వతంగా సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఢిల్లీ సిక్కు గురుద్వార్‌ మేనేజ్‌మెంట్ కమిటీ (డీఎస్‌జీఎంఎస్‌) భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖలో కంగనా రనౌత్‌కు ప్రదానం చేసిన పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం గమనార్హం.

(చదవండి: పెళ్లి బాజాలతో.. 65 కోళ్లు మృతి!..ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో!!)

మరిన్ని వార్తలు