పునీత్‌కు పద్మ శ్రీ ఇవ్వాల్సిందే !!

7 Nov, 2021 20:25 IST|Sakshi

బెంగళూరు: ఇటీవల మరణించిన కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతరం 'పద్మశ్రీ' అవార్డు వచ్చే విధంగా కేం‍ద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయండి అంటూ కర్ణాటక ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రలు కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకువస్తున్నారు. 

(చదవండి: ట్యాక్సీల్లో వాళ్లను తప్ప ఇంకెవ్వరని ఎక్కించుకుని తీసుకురావద్దు!)

కన్నడ సూపర్‌స్టార్‌ ఇటీవల అక్టోబర్ 29న 46 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు  కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్‌ మాట్లాడుతూ" పునీత్‌ రాజ్‌కుమార్‌ జీవించి ఉన్నప్పుడే ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చి ఉండాల్సిందని, అయితే దురదృష్టవశాత్తు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవడంతో మరణానంతరం ఇవ్వాల్సిందే. నేను అతని అభిమానినే. పునీత్‌కి నటుడిగానే కాకుండా, సమాజానికి అందించిన సేవల కోసమైన ఇవ్వాల్సిందే. పైగా అతనికి ఆ అర్హత ఉంది. అని అన్నారు.

అంతేకాదు పర్యాటక శాఖ మంత్రి ఆనంద్‌సింగ్‌   మాట్లాడుతూ.. 'పునీత్‌ రాజ్‌కుమార్‌ మానవాళికి సేవ చేయాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తి, నేను సామాజిక సేవలో ఉన్నప్పుడు పల్స్‌ పోలియో వంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో మాతో కలిశాడు. ఆయనకు పద్మశ్రీని ఇ‍వ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేం‍‍ద్రాన్ని డిమాండ్‌ చేయాలి " అని అన్నారు. 

అయితే ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య.. పునీత్‌కు మరణానంతరం పద్మశ్రీ ప్రదానం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని ట్విట్టర్‌లో కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ... “పద్మ అవార్డులకు ఎప్పుడు, ఏ రంగాల వ్యక్తులను సిఫారసు చేయాలనే దానిపై కొన్ని నియమాలు ఉన్నాయి. ఇది ఒక విధంగా పునీత్ రాజ్‌కుమార్‌కు ఏకగ్రీవ సిఫార్సు అవుతుందేమో. ఏదిఏమైన ప్రభుత్వ పరంగా అన్నీ విషయాలు పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు.

(చదవండి: విచిత్రమైన వంటకం...అదే ఏం పకోడి రా బాబు!)

మరిన్ని వార్తలు