రాష్ట్రాలను కోరుతూ కేంద్రం లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో స్థానికంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో కోవిడ్ నియంత్రణ చర్యలను కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30 వరకు పొడిగించింది. ఈ మేరకు గురువారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. ముఖ్యంగా పండుగ సీజన్లో తగిన జాగ్రత్తలతో, సురక్షితంగా ప్రజలను బయటికి అనుమతించే మార్గదర్శకాలను అమలు చేయడం చాలా కీలకమని ఆయన చెప్పారు. దేశంలో రోజువారీ కేసులు, యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో స్థానికంగా వైరస్ వ్యాప్తి ఉందని, ఇది ప్రజారోగ్య సవాల్గా కొనసాగుతోందని భల్లా లేఖలో పేర్కొన్నారు. పండుగ సీజన్లో టెస్ట్–ట్రాక్–ట్రీట్–వ్యాక్సినేషన్, కోవిడ్ ప్రోటోకాల్స్కు కట్టుబడి ఉండటంపై నిరంతరం దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.