బైక్‌పై చిన్నారులుంటే.. వేగం 40 కి.మీ. మించరాదు: కేంద్రం ప్రతిపాదన

27 Oct, 2021 08:15 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: నాలుగేళ్లలోపు చిన్నారులు ప్రయాణించే మోటార్‌ బైక్‌ వేగం గంటకు 40 కిలోమీటర్లకు మించరాదని కేంద్రం ప్రతిపాదించింది. దీంతో పాటు, 9 నెలల నుంచి 4 ఏళ్లలోపు చిన్నారులైతే తప్పని సరిగా హెల్మెట్‌ ఉండేలా వాహనదారు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. దీంతోపాటు, వాహన చోదకుడు ఆ చిన్నారిని సేఫ్టీ పట్టీతో తన వీపునకు తగిలించుకోవాలని పేర్కొంది.

దీనివల్ల, చిన్నారి మెడ, తలభాగాలకు పూర్తి రక్షణ కల్పించినట్లు అవుతుందని వివరించింది. దృఢమైన, తేలికపాటి, నీటిలో తడవని, అవసరానికి అనుగుణంగా సరి  చేసుకోదగ్గ, కనీసం 30 కిలోల బరువును మోయగలిగే నైలాన్‌తో ఆ పట్టీ తయారయినదై ఉండాలని తెలిపింది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే చిన్నారుల భద్రతే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలను రూపొందించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ తెలిపింది. అభ్యంతరాలు, సూచనలు తెలియజేయాల్సిందిగా ప్రజలను కోరింది.
(చదవండి: రెండు రోజులు తర్వాత పుట్టింటికి .. బావిలో శవాలుగా తేలిన తల్లీ, కూతురు)

మరిన్ని వార్తలు