సీఎంను చంపేస్తానంటూ వార్నింగ్‌.. మూడు నెలలే గడువు అంటూ..

14 Mar, 2022 07:36 IST|Sakshi

ఐజ్వాల్‌: ఏకంగా ముఖ్యమంత్రినే చంపేస్తానంటూ సోషల్‌ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్ప్డడ్డాడు ఓ వ్యక్తి. మూడు నెలల్లోగా సీఎం పదవికి రాజీనామా చేయాలని లేని పక్షంలో చంపేస్తానంటూ వార్నింగ్‌ ఇచ్చాడు. సీఎంను చంపేందుకు ఇప్పటికే ఓ స్పెషలిస్ట్‌ షూటర్‌ను సైతం రెడీ చేసుకున్నట్టు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టాడు. తీరా పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అరెస్ట్‌ అయ్యాడు.

వివరాల ప్రకారం.. మూడు నెలల్లో రాజీనామా చేయకపోతే చంపేస్తానంటూ మిజోరం సీఎం జొరాంథంగాపై ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. కాగా, సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్‌తో ఇలా పోస్టులు పెట్టాడు. బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు నిఘా పెట్టి.. సదరు వ్యక్తిని ఖాజ్వల్​ ప్రాంతానికి చెందిన రోడిన్​లియానా అలియాస్​ అపుయా టోచ్ఛాంగ్​గా గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు ఐజ్వాల్​లోని ఛాన్మరీ ప్రాంతంలో నివాసం ఉంటుండుగా.. తింగ్​ట్లాంగ్​ పా అనే నకిలీ ఫేస్‌ బుక్‌ అకౌంట్​ ద్వారా బెదిరింపులకు పాల్పడి వివిధ ఫేస్​బుక్​ గ్రూపుల్లో షేర్​ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

అయితే, ముఖ్యమంత్రి జొరాంథంగా రాష్ట్ర బడ్జెట్​ను తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని దుష్ప్రచారం చేస్తున్నాడని పోలీసులు వెల్లడిస్తూ ఈ కారణంగానే నిందితుడిని అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా సదరు నిందితుడు 2018లో కూడా అప్పటి ముఖ్యమంత్రి లాల్‌ తన్హావాలాకు లేఖ రాసి ఆయనను కూడా చంపేస్తానని బెదిరించాడు. అప్పుడు కూడా పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు