MK STalin: పొగడ్తలతో ముంచెత్తే వార్తలొద్దు..  విమర్శించండి సరి చేసుకుంటాం 

11 Oct, 2021 06:48 IST|Sakshi

మీడియాకు సీఎం ఎంకే స్టాలిన్‌ 

సాక్షి, చెన్నై: ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తే విధంగా వార్తలు, కథనాలు ప్రచురించాలని తాను ఎన్నడూ ఆదేశించలేదని సీఎం ఎంకే స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాల్లో లోటుపాట్లు, విమర్శలు ఉంటే ఎత్తి చూపించాలని, వాటిని సరి చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక నేతృత్వంలో ఆదివారం చెన్నైలో జరిగిన కార్యక్రమానికి  సీఎం ఎంకే స్టాలిన్‌  హాజరయ్యారు.

చదవండి: (ఇకపై ట్రాఫిక్‌ ఆపొద్దు.. ప్రజల వాహనాలతో కలిసే..)

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని సామాజిక వర్గాల సంక్షేమం, అభివృద్ధి డీఎంకే మోడల్‌ అని, ఆ దిశగానే తమ పయనం సాగుతోందని వివరించారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకొచ్చామని, పారిశ్రామిక రంగానికి పునర్జీవం పోశామ ని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని పారిశ్రామిక ఎగుమతుల్లో తమిళనాడు మూడో స్థానంలో నిలిచినట్టు గుర్తు చేశారు. తమిళనాడు పారిశ్రామిక పెట్టుబడులకు నెలవు అని, ఇక్కడ అన్ని రకాల వసతులు, అవకాశాలు మెండుగా ఉన్నాయని వివరించారు.

చదవండి: (నేనొస్తున్నా.. అన్నాడీఎంకే అందరిదీ అందరూ సమానమే: శశికళ) 

ప్రభుత్వ పథకాలను, తమ పనితీరును పొగడ్తలతో ముంచెత్తాలని తాను ఎన్నడూ మీడియాను ఆదేశించ లేదన్నారు. విమర్శలు ఎత్తి చూపించాలని, వాటిని సరి చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రం రూ. 5 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు. అలాగే,  రూ. 2 లక్షల కోట్లు పబ్లిక్‌ రంగ సంస్థలు సైతం అప్పుల్లో ఉన్నట్టు వివరించారు. నిధుల సమీకరణకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్టు పేర్కొన్నారు. అయితే, జీఎస్టీ రూపంలో రాష్ట్రాల హక్కుల్ని యూనియన్‌ ప్రభుత్వం కాల రాసి, ఆ నిధుల్ని తన్నుకెళ్తోందని ధ్వజమెత్తారు.  

మరిన్ని వార్తలు