‘నీట్‌’ రద్దుకు నిరంతర పోరాటమని వెల్లడి.. ధైర్యం చెప్పిన సీఎం

15 Sep, 2021 20:27 IST|Sakshi

నీట్‌పై ఆందోళన చెందుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేక చర్యలు

ముఖ్యమంత్రి స్టాలిన్‌ వీడియో సందేశం

నీట్‌ రద్దయ్యే దాక పోరాడుతామని ప్రకటన

చెన్నె: మూడు రోజుల్లో ముగ్గురు ‘నీట్‌’ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష)పై భయంతో ఆందోళన చెందుతూ బలవన్మరణానికి పాల్పడ్డారు. వారి మరణం తమిళనాడు రాష్ట్రాన్ని కదిలించింది. పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అయితే చలించిపోయారు. తమ విద్యార్థులకు బలిపీఠంగా మారిందని పేర్కొన్న స్టాలిన్‌ నివారణ చర్యలు చేపట్టారు. మెడికల్‌ ప్రవేశ పరీక్ష నీట్‌ నుంచి ఉపశమనం కలిగిస్తూ అసెంబ్లీలో ఓ బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బిల్లు పెట్టినా కూడా విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. తాజాగా ఓ యువతి కూడా ఆత్మహత్య చేసుకోవడంతో సీఎం స్టాలిన్‌ ఆవేదన చెందారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మనోధైర్యం కల్పిస్తూ ఓ సందేశం విడుదల చేశారు.
చదవండి: నీట్‌ బలిపీఠంపై మరో మరణం.. సీఎం స్టాలిన్‌ దిగ్భ్రాంతి

‘నీట్‌తో ఆందోళన చెందుతున్న విద్యార్థుల కోసం 24/7 పని చేసే హెల్ప్‌లైన్‌ను మొదలుపెట్టాం’ అని సీఎం స్టాలిన్‌ తెలిపారు. విద్యార్థులకు నిరంతరం కౌన్సిలింగ్‌ ఇస్తామని ప్రకటించారు. మనస్తాపం.. ఒత్తిడితో బాధపడుతుంటే 104కు సంప్రదించాలని.. వ్యక్తిత్వ వికాస నిపుణుడితో మాట్లాడించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. వీటికోసం ఏకంగా 330 మంది నిపుణులను నియమించినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్‌ తెలిపారు.
చదవండి: కులాలు వేరు.. అయినా ఘనంగా పెళ్లి చేస్తారని నమ్మివెళ్తే..

‘ప్రియమైన విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందొద్దు. తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మేం మొత్తం మారుస్తాం. నీట్‌ రద్దు చేసేంత వరకు మేం విశ్రమించం’ అని సీఎం స్టాలిన్‌ స్పష్టం చేశారు. రాతి హృదయాలను కరిగిద్దాం అని పిలుపునిచ్చారు. దయచేసి ఆత్మహత్యలకు పాల్పడ్డవద్దని రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. నీట్‌పై తమిళనాడులోని అన్ని పార్టీలు మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు