'మీలాంటి మహిళలు దేశానికి ఎంతో అవసరం

13 Aug, 2020 12:42 IST|Sakshi
మహ్మద్ కైఫ్, పురాణా సుంతారీ

మ‌ధురై : త‌మిళ‌నాడుకు చెందిన‌ పురాణా సుంతారీ(25) చిన్నప్పుడే కంటిచూపు కోల్పోయింది. అయినప్పటికి బెదరకుండా సివిల్స్‌ సాధించాలన్న తన లక్ష్యం నెరవేర్చుకుంది. రెండు వారాల క్రితం విడుదలైన 2019 సివిల్స్ ప‌రీక్ష‌ తుది ఫ‌లితాల్లో సుంతారీ 286వ ర్యాంక్ సాధించి ఐఏఎస్‌కు ఎంపికైంది. త‌న అద్భుత ప్ర‌తిభ‌పై స‌ర్వత్రా ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలో మాజీ క్రికెట‌ర్ మహ్మద్ కైఫ్ సోష‌ల్ మీడియా వేదిక ట్విట్ట‌ర్ ద్వారా పురాణా సుంతారీపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఆమె విజ‌యాన్ని మెచ్చుకుంటూ ట్వీట్‌ చేశారు.

'పురాణ సుంతారీ... మీ కృషి, పట్టుదలకు హ్యాట్సాఫ్‌. ఆడియో స్టడీ మెటీరియల్‌తో ప‌రీక్ష‌లు రాయ‌డం చాలా క‌ష్ట‌ం. ఈ విష‌యంలో ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు పుస్తకాలను ఆడియో ఫార్మాట్‌గా మార్చడానికి సహాయం చేశారు. ఎంతో పట్టుదలతో సివిల్స్‌లో మంచి ర్యాంక్‌ను సాధించి ఐఏఎస్‌కు ఎంపికైంది. మీ కలలను సాకారం చేసుకోవడం ఇక మీదట కూడా ఎప్పుడూ ఆపొద్దు. మీలాంటి మహిళలు ఈ దేశానికి ఎంతో అవసరం.' అంటూ కైఫ్‌ చెప్పుకొచ్చాడు.

మ‌ధురైకి చెందిన పురాణా సుంతారీ త‌న‌ ఐదేళ్ల వ‌య‌సులో కంటి చూపు మంద‌గించింది. ఒక‌టో త‌ర‌గ‌తికి రాగానే పూర్తిగా కంటిచూపును కోల్పోయింది. అయిన‌ప్ప‌టికీ చ‌దువును ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌లేదు. త‌ల్లిదండ్రులు, స్నేహితుల స‌హ‌కారంతో కష్ట‌ప‌డి చ‌దివింది. ఐఏఎస్ కావాల‌ని ల‌క్ష్యం పెట్టుకుంది. అందుకు త‌గ్గ‌ట్టు ప్ర‌ణాళిక సిద్ధం చేసుకుని ప్రిప‌రేష‌న్ కొన‌సాగించింది. మొద‌టి మూడుసార్లు సివిల్స్ లో విజ‌యం సాధించ‌లేక‌పోయింది. నాలుగోసారి 286 ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికై అందరికి ఆదర్శంగా నిలిచింది.

మరిన్ని వార్తలు