Mohan Bhagwat: 80 శాతం నిధులు రాజకీయ నేతల జేబుల్లోకి వెళ్లేవి

17 Oct, 2021 13:06 IST|Sakshi

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)చీఫ్ మోహన్ భగవత్

నాగ్‌పూర్‌: ఆర్టికల్ 370 రద్దుకు ముందు జమ్మూ కశ్మీర్‌కు కేటాయించిన నిధుల్లో 80 శాతం రాజకీయ నాయకులు తమ జేబుల్లో వేసుకున్నారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ తీవ్రంగా ఆరోపించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దుకు ముందు, కాశ్మీర్ లోయ కోసం కేటాయించిన 80 శాతం నిధులు రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్లేవని అన్నారు. కేటాయించిన నిధులు ప్రజలకు చేరలేదని మండిపడ్డారు. ప్రస్తుతం కశ్మీర్ లోయలోని ప్రజలు అభివృద్ధిని ప్రత్యక్షంగా పొందుతున్నారని తెలిపారు.

తాను జమ్మూ కాశ్మీర్‌ను సందర్శించి ప్రస్తుత అక్కడ ఉన్న పరిస్థితిని చూశానని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తోందని అన్నారు. గతంలో జమ్మూ, లడఖ్‌పై తీవ్రమైన వివక్ష ఉండేదని అన్నారు. కానీ ప్రస్తుతం అక్కడ ఎటువంటి వివక్ష లేదని పేర్కొన్నారు. ఆగస్టు 2019లో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులను అందించే ఆర్టికల్ 370ను రద్దు చేసిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు