‘అమ్మా.. తప్పకుండా తిరిగొస్తాను’ తల్లికి సంజయ్‌ రౌత్‌ భావోద్వేగ లేఖ

12 Oct, 2022 18:43 IST|Sakshi

సాక్షి, ముంబై: పత్రాచల్‌ భూకుంభకోణంలో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న శివసేన ఫైర్‌బ్రాండ్‌, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌ తన తల్లికి భావోద్వేగ లేఖ రాశారు. తను ఖచ్చితంగా తిరిగి వస్తానని, అప్పటి వరకు ఉద్దవ్‌ ఠాక్రే, శివ సైనికులు నిన్ను(తల్లి) జాగ్రత్తగా చూసుకుంటారని హామీ ఇచ్చారు. శివసేనకు ద్రోహం చేసేలా ఒత్తిడి తీసుకొచ్చారని, వాళ్ల ఒత్తిళ్లకు లొంగకపోవడం వల్లే నేడు తల్లికి దూరంగా ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు ఈ లేఖను సంజయ​ రౌత్‌ తన ట్విటర్‌లో బుధవారం పోస్టు చేశారు.

‘నీలాగే(తల్లి) శివసేన కూడా నాకు అమ్మతో సమానం. నా తల్లికి(శివసేన) ద్రోహం చేసేలా ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని బెదిరించారు. వారి బెదిరింపులకు లొంగకపోవడం వల్ల జైలుకు వెళ్లాల్సి వస్తోంది. ఈ కారణం వల్లే ఈరోజు నేను నీకు దూరంగా ఉన్నాను. దేశం కోసం సరిహద్దుల్లో నిలబడి పోరాడుతున్న వేలాది మంది సైనికులు నెలల తరబడి ఇంటికి రారు. కొందరు ఇంటికి ఎప్పటికీ వెళ్లరు. నేను కూడా మహారాష్ట్ర, శివసేన శత్రువులకు తలవంచలేను. మహారాష్ట్ర, దేశ విధేయుడిని అంత తేలిగ్గా చంపలేరు.
చదవండి: తండ్రి చితికి నిప్పుపెట్టిన మరునాడే అఖిలేశ్ ఎమోషనల్ పోస్ట్‌

రాజకీయ ప్రత్యర్థుల ముందు తలవంచబోను. ఈ ఆత్మగౌరవాన్ని నేను మీ నుంచే నేర్చుకున్నా. శివసేన, బాలాసాహెబ్‌ పట్ల నిజాయితీగా ఉండాలని మీరు కునా నేర్పించారు. శివసేన గడ్డు పరిస్థితుల్లో ఉంటే బాలాసాహెబ్ ఏమి చేస్తారో అది చేయాలని నేర్పించారు.’ అని లేఖలో పేర్కొన్నారు. అలాగే ఆగస్టు 8న రాసిన లేఖలో ఈడీ కస్టడీ ఇప్పుడే ముగిసిందని, జ్యుడీషియల్ కస్టడీలోకి వెళ్లే ముందు సెషన్స్‌ కోర్టు ప్రాంగణంలో కూర్చొని ఈ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. తల్లికి లేఖ రాసి చాలా ఏళ్లు అవుతోందని, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ లేఖ రాసేందుకు అవకాశం దక్కిందని పేర్కొన్నారు.

కాగా  పత్రాచల్‌  ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో అవకతవకల ఆరోపణలతో (మానీలాండరింగ్‌ కేసు) ఆగస్టు 1న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేసింది.  ఈడీ కస్టడీ ముగియడంతో ఆగస్టు 8న ఆయన్ను జ్యూడీషియల్‌ కస్టడీగి అప్పగించారు అప్పటి నుంచి ఆయన జ్యూడీషియల్‌ కస్టడీని పొడిగిస్తూనే ఉన్నారు. కాగా ఈనెల 10న సంజయ్‌ రౌత్‌ కస్టడీని అక్టోబర్‌ 17 వరకు కోర్టు పొడిగిస్తూ తీర్పునిచ్చింది. అలాగే ఈ కేసులో ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఆయన భార్య, సన్నిహతుల ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తోంది. సంజయ్ రౌత్ భార్యను కూడా ఈడీ ప్రశ్నించింది.
చదవండి: విషాదం.. ఉన్నట్టుండి స్టేజ్‌పై కుప్పకూలిన శివుడి వేషధారి..

మరిన్ని వార్తలు