హత్యకేసులో ఆధారాలు ఎత్తుకెళ్లిన కోతి.. పోలీసుల సమాధానంతో బిత్తర పోయిన జడ్జి

6 May, 2022 13:34 IST|Sakshi

జైపూర్‌: ఓ హత్య కేసులో కోర్టు ఎదుట హాజరైన పోలీసులు చెప్పిన సమాధానం విని జడ్జి బిత్తర పోయారు. దర్యాప్తులో సేకరించిన ఆధారాలన్నింటిని ఓ కోతి ఎత్తుకెళ్లిపోయిందట. ఈ ఘటన రాజస్థాన్‌లో ఈ ఘటన జరిగింది.

ఓ హత్య కేసులో పోలీసులు.. హత్యకు ఉపయోగించిన ఆయుధం, ఇతర వస్తువులను ఓ బ్యాగ్‌లో ఉంచారట. అయితే ఆ సంచిని కోతి ఎత్తుకెళ్లిందని పోలీసులు, కోర్టు ఎదుట స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. 

2016, సెప్టెంబర్‌లో..  జైపూర్‌ చాంద్‌వాజీ సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద శశికాంత్‌ శర్మ అనే వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ ఘటన తర్వాత న్యాయం కోసం మృతదేహాంతో అతని కుటుంబం ఢిల్లీ-జైపూర్‌ హైవేని దిగ్భంధించింది కూడా.  సంచలనం సృష్టించిన ఈ కేసులో ఐదురోజుల తర్వాత రాహుల్‌, మోహన్‌లాల్‌ కండేరా అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. అయితే స్టేషన్‌లో జాగా లేకపోవడంతో.. ఈ కేసులో సేకరించిన పూర్తి ఆధారాలను ఓ బ్యాగులో ఉంచి.. స్టేషన్‌ బయట ఓ చెట్టుకింద పెట్టాడట డ్యూటీ కానిస్టేబుల్‌. 

ఆ టైంలో కోతి వచ్చి ఆ బ్యాగును ఎత్తుకెళ్లిందట. ఈ కేసులో కోర్టు విచారణ.. ఏళ్ల తరబడి సాగింది. ఈమధ్యే ఈ కేసు విచారణకు రాగా.. ఆ సమయంలో ఎవిడెన్స్‌ ఏవని? జడ్జి ప్రశ్నించారు. దీంతో.. కోతి ఎత్తుకెళ్లిందని సమాధానం ఇచ్చారు పోలీసులు. ఆ బ్యాగులో మొత్తం 15 వస్తువులు కేసుకు సంబంధించినవి ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. 
ఇక పోలీసులు కోర్టుకు సమర్పించిన రాత పూర్వక స్టేట్‌మెంట్‌లో.. ఈ విషయాన్ని కింది న్యాయస్థానానికి తెలియజేశామని, ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు పోలీసులకు నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలియజేసింది. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్‌ను ఘటన తర్వాత సస్పెండ్‌ చేశారట. ఆ తర్వాత ఆయన రిటైర్డ్‌ కావడంతో పాటు మరణించాడని సదరు స్టేట్‌మెంట్‌లో కోర్టుకు వివరించారు పోలీసులు. ఇది కోతి కథతో పోలీసులు ఇచ్చిన వివరణ.

మరిన్ని వార్తలు