MonkeyPox In India: ఢిల్లీలో మరో కేసు... ఎనిమిదికి చేరిన కేసులు

2 Aug, 2022 16:44 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో నివశిస్తున్న నైజీరియన్‌ వ్యక్తికి మంకీపాక్స్‌ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో రాజధానిలో మొత్తం మూడు కేసులు, దేశవ్యాప్తంగా ఎనిమిదికి చేరుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో నివశిస్తున్న 35 ఏళ్ల నైజిరియన్‌ వ్యక్తి నుంచి శాంపిల్స్‌ సేకరించి, వాటిని పుణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ పంపినప్పుడు పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. ప్రస్తుతం ఆ వ్యక్తి  ఢిల్లీ ప్రభుత్వాస్పత్రి ఎల్‌ఎన్‌జీపీలో  చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ఐతే ఈ వ్యక్తి విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన నేపథ్యం కూడా లేదని స్పష్టం చేశారు.

అంతేకాదు అంతకు ముందురోజే యూఏఈ నుంచి కోజీకోడ్‌ వచ్చిన ఒక వ్యక్తికి మంకీపాక్స్‌ వచ్చింది. ప్రస్తుతం అతను మలప్పురంలో చికిత్స పొందుతున్నాడు. అదీగాక ఇటీవలే కేరళలో మంకీపాక్స్‌తో మరణించిన తొలి కేసును కూడా అధికారులు ధృవీకరించారు. ఇదిలా ఉండగా, ఒక వ్యక్తి మంకీపాక్స్‌ వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి వెళ్లినట్లు కూడా తెలిపారు. దీంతో భారత ప్రభుత్వం ఈ వ్యాధి నియంత్రణ కోసం, వ్యాక్సిన్‌ల అభివృద్ధిని పర్యవేక్షించడానికి జాతీయ టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేసినట్లు ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ మాదవియా వెల్లడించారు. ఈ టాస్క్‌ఫోర్సులో డాక్టర్‌ వీకే పాల్‌ తోపాటు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ నేతృత్వంలో ఇతర సభ్యులు ఉన్నారని చెప్పారు. 

(చదవండి: తెరపైకి ‘పౌరసత్వ’ చట్టం.. బూస్టర్‌ డోస్‌ పంపిణీ పూర్తవగానే అమలులోకి!)

మరిన్ని వార్తలు