Tamil Nadu: అప్పటికే ఇద్దరు.. నాలుగో ప్రియుడి కోసం ఆమె ఏం చేసిందంటే..?

26 Mar, 2022 20:20 IST|Sakshi

సాక్షి, చెన్నై: కొన్నేళ్ల క్రితం వారికి వివాహమైంది. పెళ్లి బంధంతో ఎంతో హ్యాపీగా ఉన్నారు. వారికి ఇద్దరు సంతానం కూడా ఉండగా.. కుటుంబ కలహాలతో విడాకులు తీసుకుని విడిపోయారు. తమకు పుట్టిన ఇద్దరు పిల్లలను పంచుకున్నారు. తల్లి వద్ద ఒకరు, తండ్రి వద్ద మరొకరు ఉండగా.. ఆమె వద్ద ఉన్న కొడుకు ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు. పోస్టుమార్టం చేసిన వైద్యులకు కూడా ఎలా చనిపోయాడో అంతు చిక్కలేదు. తీరా పోలీసుల ఎంట్రీతో ఆమె అసలు రంగు బయటపడింది. నాలుగో బాయ్‌ ఫ్రెండ్‌తో జల్సాల కోసం కన్నింగ్‌ ప్లాన్‌తో కన్నకొడుకునే హతమార్చింది. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. ఊటీలోని వాషర్ మెన్ పేట్‌కు చెందిన కార్తీక్ (40), గీత (38)ను కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. పెద్దలు కుదిర్చిన వివాహం కావాడంతో కొంత కాలం సంతోషంగా కాపురం చేశారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. పెద్దల సమక్షంలో పంచాయితీలు చేసినా కాపురం నిలబడకపోవడంతో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో కొడుకులు నితీశ్‌, నితిన్‌లను  పంచుకున్నారు. ఒక కొడుకు తల్లి దగ్గర, ఇంకో కొడుకు తండ్రి దగ్గర ఉంటున్నారు.

ఇదిలా ఉండగా.. ఓరోజు తల్లి దగ్గర ఉన్న నితిన్‌ ఆందోళనతో ఆమె ఆసుపత్రికి తీసుకెళ్లింది. తన కొడుకు ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడని ఆమె వైద్యుల వద్ద కన్నీరుపెట్టుకుంది. ఈ క్రమంలో అప్పటికే బాలుడు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. కాగా, పోస్టుమార్టం నివేదికలో బాలుడు ఎలా చనిపోయాడో వైద్యులు తెలుసుకోలేకపోయారు. దీంతో, బాలుడి మృతిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుండగా పోలీసులకు షాకింగ్‌ విషయాలు తెలిశాయి. గీతకు అప్పటికే నలుగురు బాయ్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారని పోలీసులు గుర్తించారు. కార్తీక్‌తో పెళ్లికి ముందే మరో ఇద్దరిని ఆమె వివాహం చేసుకుని విడాకులు ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. నాలుగో బాయ్‌ ఫ్రెండ్‌తో జల్సాల కోసమే విడాకులు తీసుకున్నట్టు పేర్కొన్నారు. తమ జల్సాల అడ్డుగా ఉన్నాడనే గీత తన బిడ్డకు.. మద్యం తాగించి, ఎక్కువ భోజనం పెట్టి, పదే పదే పాలు తాగించి హత్య చేసిందని పోలీసులు వెల్లడించారు. దీంతో ఆమెను అరెస్ట్‌ చేసినట్టు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు