కంట‌త‌డి పెట్టిస్తున్న త‌ల్లి క‌న్నీటి గాధ‌

22 Sep, 2020 19:31 IST|Sakshi

కొచ్చి: త‌ల్లి త‌న బిడ్డ‌ల‌ను న‌వ‌మాసాలు క‌డుపులో మోస్తుంది. ఈ లోకంలోకి అడుగు పెట్టాక వారి పెరుగుద‌ల కోసం జీవితాన్నే త్యాగం చేస్తుంది. పిల్ల‌ల క‌న్నా త‌న‌కేదీ ముఖ్యం కాద‌నుకున్న ఓ త‌ల్లి గుండెతో స‌హా త‌న అవ‌య‌వాల‌ను అమ్మ‌కానికి పెట్టింది. అంద‌రినీ కంట‌త‌డి పెట్టిస్తోన్న ఈ ఘ‌ట‌న కేర‌ళ‌లోని కొచ్చిలో జ‌రిగింది. క‌టిక దారిద్య్రాన్ని అనుభ‌విస్తున్న ఆ పేద మ‌హిళ పేరు శాంతి. ఆమెకు ఐదుగురు పిల్ల‌లు. కాయ‌క‌ష్టం చేసి పైసలు సంపాదిస్తున్న‌ ఆమె పెద్ద కొడుకు గ‌తేడాది రోడ్డు ప్ర‌మాదంలో తీవ్ర ‌గాయాల‌పాల‌య్యాడు. దీంతో అత‌నికి బ్రెయిన్ స‌ర్జ‌రీ చేశారు. రెండో కొడుకు పుట్టుక‌తోనే మాన‌సిక రుగ్మ‌త‌తో బాధ‌ప‌డుతున్నాడు. (కూతురి బర్త్‌డే: ఆ తండ్రి కోరిక ఇదే!)

చేయి చాచి అడిగినా సాయం చేయ‌లేదు
ప‌ద‌కొండేళ్ల కూతురు కూడా రోడ్డు ప్ర‌మాదంతో న‌రాల వ్యాధి బారిన ప‌డింది. వీరంద‌రినీ పోషించేందుకు కుటుంబ బాధ్య‌త‌ను భుజాన వేసుకున్న‌ మూడో కొడుకును లాక్‌డౌన్ వెక్కిరించ‌డంతో ఉపాధి కోల్పోయాడు. ఆఖ‌రు బిడ్డ‌ ఇంకా స్కూలు విద్య‌న‌భ్య‌సిస్తోంది. ఇల్లు గ‌డ‌వ‌డ‌మే కష్టంగా ఉన్న ఆ కుటుంబానికి పిల్ల‌ల మందులకు మ‌రింత ఇబ్బంది కాసాగింది. దీంతో ఆ త‌ల్లి సిగ్గు చంపుకుని చేయి చాచి సాయం కోరితే పైసా ఇవ్వ‌డానికి కూడా ఎవ‌రూ ముందుకు రాలేదు. దీంతో ఈసారి ఆమె ఎవ‌రి సాయం కోర‌లేదు. త‌న అవ‌యవాల‌ను అమ్మి అయినా స‌రే పిల్ల‌ల చికిత్స‌కు ఏ లోటూ రాకూడ‌ద‌ని, ఉన్న అప్పులు తీరిపోవాల‌ని నిర్ణ‌యించుకుంది. ఓ బోర్డును ఏర్పాటు చేసి, దానిపై త‌న గుండెతో స‌హా అన్ని అవ‌య‌వాల‌ను అమ్మేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని పేర్కొంది. ఆమె బ్ల‌డ్‌గ్రూప్ వివ‌రాల‌ను కూడా పొందుప‌రిచింది.

స్పందించిన ప్ర‌భుత్వం
ఈ విష‌యం గురించి శాంతి మాట్లాడుతూ.. "నేను గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు భ‌ర్త వ‌దిలేశాడు. త‌ర్వాత‌ డ్రైవింగ్ టీచ‌ర్‌గా ప‌ని చేశాను. కానీ అప్పుడే కూతురి ఆరోగ్యం పాడ‌వ‌డంతో ఆమెను చూసుకునేందుకు ఆ ప‌నిని వ‌దిలేయ‌క త‌ప్ప‌లేదు. చాలా రోజులుగా అద్దె ఇంట్లో ఉంటున్నాం. ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జారిపోతున్నాయి. అద్దె కూడా చెల్లించ‌లేని నిస్స‌హాయ స్థితికి చేరుకున్నాం. నా ముగ్గురు పిల్ల‌ల‌కు తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌లున్నాయి. అందుకే నా అవ‌యవాల‌ను అమ్మి వారిని బాగు చేసేందుకు సిద్ధ‌మ‌య్యాను" అని వాపోయింది. ఇక ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో అక్క‌డి ప్ర‌భుత్వం స్పందించింది. ఆమెను తాత్కాలిక నివాసానికి త‌ర‌లించింది. ఆమె పిల్ల‌లకు అవ‌స‌ర‌మ‌య్యే చికిత్స‌ను, మందుల బిల్లుల‌ను కూడా ప్ర‌భుత్వ‌మే భ‌ర్తిస్తుంద‌ని కేర‌ళ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైల‌జ హామీ ఇచ్చారు. (ఆన్‌లైన్‌ క్లాసుల్లో పరిస్థితి ఇలానే ఉంటుందేమో?)

మరిన్ని వార్తలు