ముంబై : తాగిన మైకంలో బాత్రూంలో కిందపడి మృతి చెందిన కుమారుడు బ్రతికున్నాడన్న భ్రమలో ఓ తల్లి రాత్రంతా అతడికి సపర్యలు చేస్తూ గడిపింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ముంబై, కలినా ఏరియాకు చెందిన 42 ఏళ్ల వ్యక్తి సోమవారం తాగిన మైకంలో బాత్రూంలో కిందపడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. కొద్దిసేపటి తర్వాత బాత్రూం దగ్గరకు వెళ్లిన తల్లి.. కుమారుడు కదలిక లేకుండా పడి ఉండటాన్ని గమనించింది. అనంతరం అతడ్ని(శవం)బయటకు లాక్కువచ్చింది. అతడు బ్రతికే ఉన్నాడని భావించింది. తలకైన గాయానికి పసుపు రాయటం మొదలుపెట్టింది.
రాత్రంతా శవానికి సపర్యలు చేస్తూ కూర్చుంది. అయితే మరుసటి రోజు ఉదయం కూడా కుమారుడు లేవకపోవటంతో బంధువులకు విషయం చెప్పింది. దీంతో వారు అక్కడికి వచ్చి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాధితుడ్ని ఆసుపత్రికి తరలించగా.. అతడు చాలా సేపటి క్రితమే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రాథమిక దర్యాప్తు మేరకు ప్రమాదవశాత్తు సంభవించిన మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.