భుజంపై చిన్నారి మృతదేహంతో బస్టాప్‌కు.. అందరితో పాటే బస్సులో..!

20 Oct, 2022 13:12 IST|Sakshi

భోపాల్‌: కనీస మౌలిక సదుపాయలు అందక నిరుపేదలు ఇబ్బందులు పడుతున్న హృదయవిదారక సంఘటనలు దేశంలో ఏదో చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ద్విచక్రవాహనంపై, తోపుడు బండిపై, భుజాలపై మృతదేహాలను మోసుకుంటూ వెళ్లిన సంఘటనలు కలిచివేస్తున్నాయి. అలాంటి సంఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల చిన్నారి మృతదేహాన్ని రద్దీ రోడ్డులో ఓ వ్యక్తి తన భుజాలపై మోసుకుటూ బస్టాప్‌కు వెళ్లారు. అందరితో పాటే బస్సులో మృతదేహాన్ని స్వగ్రామం చేర్చారు. ఈ హృదయవిదారక సంఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

నాలుగేళ్ల చిన్నారి స్వగ్రామంలో ప్రమాదవశాత్తు మృతి చెందింది. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఛాతర్‌పూర్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కానీ, మృతదేహాన్ని తిరిగి ఇంటికి చేర్చేందుకు ఆసుపత్రిలో వాహనం లేదు. ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. దీంతో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు దుఃఖంలో ఉన్న ఆమె మేనమామ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. బస్టాప్‌ వరకు తన భుజాలపై మోసుకెళ్లాడు. రద్దీగా ఉన్న బస్‌లోనే మృతదేహంతో ఎక్కాడు. అయితే, ఆయన వద్ద బస్సు టికెట్‌ కొనేందుకు సైతం డబ్బులు లేకపోవటం అందరిని కలచివేసింది. మరో ప్రయాణికుడు టికెట్‌ కొనిచ్చాడు. 

ఆసుపత్రి నుంచి మృతదేహాలను తరలించేందుకు పట్టణాభివృద్ధి విభాగం ఏర్పాట్లు చేయాలని చీఫ్‌ మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ లఖన్‌ తివారీ తెలిపారు. ఇలాంటి వాటిలోకి ఆసుపత్రి, వైద్యులను లాగొద్దని కోరారు. నాలుగు నెలల క్రితం సైతం ఛతార్‌పుర్‌ జిల్లాలో ఇలాగే నాలుగేళ్ల చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు భుజాలపై మోసుకెళ్లారు. దీంతో జిల్లాలో సదుపాయలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. బుధవారమే సింగ్రౌలి జిల్లాలో శిశువును బైక్‌ సైడ్‌ బాక్సులో తీసుకెళ్లటం సంచలనంగా మారింది. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: 75వేల మంది యువతకు ప్రధాని మోదీ దివాళీ గిఫ్ట్‌
 

మరిన్ని వార్తలు