వీడియో: టోల్‌ ఛార్జీ కట్టమన్నందుకు చెంపచెళ్లు.. దాడి! చెప్పుతో బుద్ధి చెప్పిన యువతి

22 Aug, 2022 07:14 IST|Sakshi

భోపాల్‌: టోల్‌ ఛార్జీ కట్టమన్నందుకు టోల్‌ బూత్‌లో పని చేసే యువతిపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. అయితే ఆ వ్యక్తిని తీవ్రంగానే ప్రతిఘటిస్తూ.. ఆ యువతి కూడా ప్రతిదాడి చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. 

మధ్యప్రదేశ్‌ రాజ్‌ఘడ్‌-భోపాల్‌ కచ్‌నారియా టోల్‌ప్లాజా వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. రాజ్‌కుమార్‌ గుజార్‌ అనే వ్యక్తి తన కారుకు ఫాస్ట్‌ట్యాగ్‌(ఈ-టోల్‌ పేమెంట్‌ వ్యవస్థ) లేకుండానే అక్కడికి వచ్చాడు. తాను స్థానికుడినని, టోల్‌ ఛార్జీల నుంచి తనకు మినహాయింపు ఉందని, ఆ ప్లాజా నిర్వాహకుడికి సైతం తనకు తెలుసని చెప్పాడు. అయితే అతను, ఆ వాహనం లోకల్‌దే అని నిరూపించుకోవడానికి ఎలాంటి ఆధారాలు అతని వద్ద లేవు. పైగా నిర్వాహకుడు సైతం ఆ వ్యక్తి ఎవరో తెలీదని చెప్పాడు. దీంతో.. టోల్‌ ఛార్జీ కట్టాల్సిందేనని సిబ్బందిగా పని చేస్తున్న అనురాధా దాంగి తేల్చి చెప్పింది.

ఆ మాట వినగానే కోపోద్రిక్తుడైన రాజ్‌కుమార్‌ ఆమె వైపు దూసుకొస్తూ.. దుర్భాషలాడాడు. అంతటితో ఆగక ఆమె చెంప చెల్లుమనిపించాడు. అయితే అనురాధా ఊరుకోలేదు. ఆమె సైతం తన చెప్పు తీసి రాజ్‌కుమార్‌ను చెడామడా వాయించింది. ఇద్దరి మధ్య పెనుగులాట జరగ్గా.. అక్కడే ఉన్న కొందరు ఆ ఇద్దరినీ నిలువరించే ప్రయత్నం చేశారు.

బూత్‌లో ఏడుగురు మహిళా సిబ్బంది ఉన్నా.. సెక్యూరిటీ గార్డులెవరూ లేనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మహిళా సిబ్బంది ఫిర్యాదు చేయగా కేసు నమోదు అయ్యింది. అయితే.. నిందితుడిని ఇంకా పోలీసులు అరెస్ట్‌ చేయలేదని సమాచారం.

మరిన్ని వార్తలు