ఎక్స్‌ప్రెస్‌ రైలు వేగానికి కుప్పకూలిన స్టేషన్‌ భవనం

27 May, 2021 20:25 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని ఓ రైల్వే స్టేషన్‌ అందరు చూస్తుండగానే కుప్పకూలిపోయింది. ఈ సంఘటన బుర్హన్‌పూర్ జిల్లాలోని చందాని రైల్వే స్టేషన్‌లో బుధవారం సాయంత్రం జరిగింది. ఈ స్టేషన్ సెంట్రల్ రైల్వే భూసవాల్ రైలు డివిజన్ పరిధిలోకి వస్తుంది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నేపానగర్-అసిగర్ మధ్య బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో పుష్పక్ ఎక్స్‌ప్రెస్ 110 కిలోమీటర్ల వేగంతో స్టేషన్ గుండా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సుమారు 14 సంవత్సరాల క్రితం నిర్మించిన స్టేషన్ భవనం రైలు వేగంగా వెళ్లడంతో ఆ ప్రకంపనలను తట్టుకోలేక కూలిపోయింది.

ప్రమాదం జరగడానికి ముందు రైలుకు గ్రీన్ సిగ్నల్ చూపించడానికి అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ప్రదీప్ కుమార్ పవార్ తన కార్యాలయం నుంచి బయటికు రావడంతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన జరిగినప్పుడు భవనంలో ఎవరూ లేరని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ తరహా ఘటన జరగడం దేశంలో ఇదే తొలిసారని పేర్కొంటున్నారు. జీఆర్‌పీ సిబ్బంది ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ కారణంగా పుష్పక్‌ రైలును 30 నిమిషాల పాటు రైల్వే స్టేషన్‌లోనే నిలిపివేశారు. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. లూప్‌ లైన్‌ ద్వారా రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.

చదవండి: ‘అంత్యక్రియలు అయ్యాక ప్రత్యక్షం.. దెయ్యమా ఏంటి?’

మరిన్ని వార్తలు