అంబానీ ఇంటి వద్ద కలకలం: మరో కీలక ట్విస్టు

10 Mar, 2021 13:05 IST|Sakshi

టాప్  అధికారి సచిన్‌ వాజే‌పై  బదిలీ వేటు

 స్కార్పియో యజమాని భార్య ఫిర్యాదు మేరకు క్రైం బ్రాంచ్‌ నుంచి తొలగింపు

 ఇప్పటికే మాజీ  సీఎం దేవేంద్ర పడ్నవీస్‌ ఆరోపణలు

సాక్షి,ముంబై: బిలియనీర్, పారిశ్రామికవేత్త‌ ముఖేశ్‌​ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల వాహనం రేపిన వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఉదంతంలో అనేక ట్విస్ట్‌ అండ్‌ టర్న్స్‌ మధ్య తాజాగా ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్(సీఐయు) హెడ్‌, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ సచిన్ వాజే‌పై వేటు పడింది. ఆయనను క్రైమ్ బ్రాంచ్ నుండి తొలగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ మేరకు రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్  బుధవారం ఒక ప్రకటన చేశారు.

ఈ కేసులో స్కార్పియో యజమాని మన్సుఖ్ హిరేన్‌ మరణం కేసులో వాజేను‌ రక్షించేందుకు  శివసేన ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ  రాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ విమర్శించారు. అలాగే ఫిబ్రవరి 22 న హోటల్‌లో శవమై కనిపించిన దాద్రా, నాగర్ హవేలీ ఎంపీ మోహన్ డెల్కర్ రాసిన సూసైడ్‌ లేఖ తన దగ్గర ఉందంటూ రాష్ట్ర అసెంబ్లీలో దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు సభలో కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యతను సంతరించుకుంది.  (ఈ ఘటనపై అసెంబ్లీలో రచ్చ చేసిన ప్రతిపక్షాలు)

గతనెల 25న అంబానీ ఇంటి ముందుపేలుడు పదార్థాలతో కనిపించిన స్కార్పియో  యజమాని, ఆటో విడిభాగాల వ్యాపారి మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పద మరణంపై ఫడ్నవిస్, పోలీసు అధికారి సచిన్‌ వాజే‌పాత్రపై  పలు అనుమానాలను వ్యక్తం చేశారు. సచిన్ తన భర్తను హత్య చేసి ఉండవచ్చని హిరేన్‌ భార్య ప్రకటన మేరకు ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. (అంబానీ ఇంటివద్ద కలకలం : ఫడ్నవీస్‌ సంచలన వ్యాఖ్యలు)

మరోవైపు తాజా వ్యవహారంతో శివసేన, బీజేపీ మధ్య రగులుతున్న వివాదం మరింత  రాజుకుంది. అన్వే నాయక్ ఆత్మహత్య కేసుకు సంబంధించి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్‌పై ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో ప్రివిలేజ్‌ మోషన్‌  ఇచ్చారు. (అంబానీ ఇంటి దగ్గర కలకలం : అనుమానాస్పద లేఖ)

మరిన్ని వార్తలు