Mulayam Singh Wife Death: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ భార్య సాధన కన్నుమూత

9 Jul, 2022 16:45 IST|Sakshi

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌ సతీమణి సాధనా గుప్తా శనివారం కన్నుమూశారు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్‌లో మేదాంత ఆసుపత్రిలో చేర్చారు.  ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తుండగా ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు.

సాధన మరణ వార్తపై స్పందించిన ఉత్తర ప్రదేశ్‌ డిప్యూటీ ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య.. యులాయం సింగ్‌, అతని కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు.  ఈ మేరకు ట్వీటర్‌లో.. ‘మాజీ ముఖ్యమంత్రి ములాయం భార్య సాధన మరణించిన చేదు వార్త తెలిసింది. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబ సభ్యులకు దేవుడు అండగా ఉండి, ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు’ ట్వీట్‌ చేశారు. అలాగే సమాజ్‌వాదీ పార్టీ అధికారిక ట్విటర్‌లో కూడా పార్టీ వ్యవస్థాపకుడి భార్య మృతిపై సంతాపం తెలుపుతూ ట్వీట్‌ చేసింది.
చదవండి: ప్రముఖ ఆర్థిక వేత్త అమర్త్య సేన్‌కు కరోనా

ఎవరీ సాధన
2003లో ములాయం సింగ్ యాదవ్ మొదటి భార్య, అఖిలేష్ యాదవ్ తల్లి మాల్తీ యాదవ్ మరణించే వరకు సాధన గుప్తా గురించి చాలా మందికి తెలియదు. అప్పటికే సాధనా గుప్తాతో సంబంధం కలిగి ఉన్న ములాయం అదే సంవత్సరం ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు. వయసులో అతని కంటే సాధన 20 ఏళ్లు చిన్నది. ఆమెకు ఇంతకుముందే పెళ్లి అయ్యింది. ప్రతీక్ యాదవ్ ఆమె కుమారుడు కాగా.. భారతీయ జనతా పార్టీ నాయకురాలు అపర్ణా యాదవ్ ఆమె కోడలు.

మరిన్ని వార్తలు