Sonali Phogat: బీజేపీ నేత సోనాలి ఫోగట్‌ మృతదేహంపై గాయాలు.. మ‌ర్డ‌ర్ కేసు న‌మోదు

25 Aug, 2022 18:46 IST|Sakshi

టిక్‌టాక్‌ స్టార్‌, బీజేపీ నేత సోనాలి ఫోగట్‌ మరణంపై గోవా పోలీసులు హత్యా కేసు నమోదు చేశారు. ఫోగట్‌ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 302 సెక్షన్‌ ప్రకారం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సోనాలీ మృతదేహానికి గురువారం గోవా మెడికల్‌ కాలేజీలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ రిపోస్టులో ఆమె శరీరంపై అనేక మొద్దుబారిన గాయాలు ఉన్నట్లు వెల్లడైంది. దీంతో సోనాలితో పనిచేసే ఇద్దరు సహచరులపై గోవా పోలీసులు హత్యానేరం అభియోగాలు మోపారు.

కాగా హర్యానాలోని హిసార్‌కు చెందిన టిక్‌టాక్‌ స్టార్‌, బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ (42) ఆగస్టు 23న హఠాన్మరణం చెందింది. ఉదయం 9 గంటల సమయంలో గుండెపోటుకు గురైన సోనాలి ఆసుపత్రికి తరలించేలోపు తుదిశ్వాస విడిచారు. అయితే ఆమె మరణం వెనుక హత్య కుట్ర దాగి ఉందని సోనాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
చదవండి: సోనాల్‌ ఫోగట్‌పై మూడేళ్లుగా అత్యాచారం.. వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్‌!

సోనాలి పీఏ సుధీర్ సంగ్వాన్‌తోపాటు ఆమెతో సన్నిహితంగా ఉండే సుఖ్వింధర్‌ అనే ఇద్దరు వ్యక్తులే హత్య చేసి ఉంటారని ఆరోపిస్తూ ఆమె సోదరుడు రింకూ ధాకా బుధవారం అంజునా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించారు. గోవా డీజీపీ స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు