పతంగి కోసం వెళ్లి.. పెంటకుప్పలో పడి

15 Jan, 2021 14:23 IST|Sakshi

ముంబై: సంక్రాంతి పండుగ అనగానే పిల్లలకు వెంటనే గుర్తుకు వచ్చేది గాలిపటాలు. అవును పండుగ ముందు నుంచి మొదలయ్యే పతంగుల సందడి ఆ తర్వాత కూడా రెండు మూడు రోజుల పాటు కొనసాగుతుంది. అయితే పతంగులు సంతోషాన్నే కాదు.. అప్పుడప్పుడు విషాదాన్ని కూడా నింపుతాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి మహారాష్ట్ర ముంబైలో చోటు చేసుకుంది. గాలిపటం కోసం పరిగెత్తుకుంటూ వెళ్లి పేడ కుప్పలో పడి ఓ 10 పదేళ్ల బాలుడు మరణించాడు. ముంబై కండివాలి ప్రాంతంలో ఈ విషాదం చోటు చేసుకుంది. వివరాలు.. పదేళ్ల చిన్నారి పండుగ సందర్భంగా గాలిపటం ఎగురేస్తూ.. ఎంజాయ్‌ చేస్తున్నాడు. అయితే మధ్యాహ్నం సమయంలో బాలుడు ఎగురవేస్తున్న గాలిపటం పక్కనే ఉన్న ఆవుల షెడ్డు సమీపంలో పడిపోయింది. (చదవండి: వైరల్‌ వీడియో.. ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం)

షెడ్డు పక్కనే ఓ పెద్ద గొయ్యి ఉంది. దానిలో ఆవుల పేడ వేస్తారు. ఇక గాలిపటం మీద ఆసక్తితో ప్రమాదాన్ని అంచనా వేయకుండా పరిగెత్తిన సదరు చిన్నారి.. ఆ పేడ గోతిలో పడిపోయాడు. బయటకు రాలేక.. ఊపిరాడక మరణించాడు. ఆ సమయంలో పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌ దగ్గర పని చేస్తున్న కొందరు వ్యక్తులు చిన్నారి పేడ గోతిలో పడిపోవడం చూశారు. బయటకు తీద్దామని భావించారు.. కానీ తాము కూడా గోతిలో ఇరుక్కుంటే మరణించే అవకాశం ఉంటుందని భావించి ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఆ తర్వాత బిల్డింగ్‌ దగ్గర క్రేన్‌ ఉండటంతో దాని సాయంతో బాలుడిని బయకు తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చిన్నారి మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిర్లక్ష్యం కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు