వీడియో: యాక్సిడెంట్‌ స్పాట్‌లో సాయం కోసం దిగారు.. అంతలోనే ఘోరం

5 Oct, 2022 15:23 IST|Sakshi

ముంబై: ప్రమాదం జరిగిందని సాయం అందించేందుకు కార్లు దిగిన కొందరిని.. మృత్యువు అతివేగం రూపంలో కబళించేసింది. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఓ కారు.. ఆంబులెన్స్‌ను, మూడు కార్లను ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ముంబైలోని బాంద్రా-వర్లి సీ లింక్‌ మీద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 

బుధవారం ఉదయం 3గం. ప్రాంతంలో బాంద్రా-వర్లి సీ లింక్‌ 76-78 పోల్స్‌ మధ్య ఈ ఘటన జరిగింది. దక్షిణ ముంబై వర్లి‌-పశ్చిమ సబర్బ్స్‌ను కలుపుతూ ఉండే ఈ వారధిపై ప్రమాదం జరిగిందని, ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారని, మరో ఎనిమిది మంది చికిత్స పొందుతున్నట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. 

తొలుత ఓ కారు డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తా పడింది. క్షతగాత్రులకు సాయం అందించేందుకు అక్కడికి చేరుకుంది ఆంబులెన్స్‌. ఈ క్రమంలో కార్లలో వెళ్తున్న కొందరు ఆగారు. ఇద్దరు కార్ల నుంచి దిగి.. ఆంబులెన్స్‌ సిబ్బందికి సాయం చేయబోయారు. ఆ సమయంలోనే వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. కార్లను, ఆంబులెన్స్‌లను బలంగా ఢీ కొట్టింది. దీంతో అంతా చెల్లాచెదురై పడిపోయారు. 

ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు.. క్షతగాత్రులను స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే మార్గాన్ని మూసేశారు. 

ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఘటన బాధించిందని, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారాయన. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: అప్పటిదాకా సంతోషం.. అంతలోనే ఊహించని విషాదం

మరిన్ని వార్తలు