ఆమె సంకల్పానికి సలాం.. రాష్ట్రవ్యాప్తంగా చర్చల్లోకి..

17 Dec, 2021 14:26 IST|Sakshi

బస్సులు లేకపోవడంతో గుర్రంపైనే బడికి వెళుతున్న చిన్నారి 

ముంబై: ఆర్టీసీ సమ్మె కష్టాలు గ్రామీణ విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులను సృష్టిస్తున్నాయి. చిన్న చిన్న గ్రామాల నుంచి ఆర్టీసీ బస్సులలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సమ్మె కారణంగా బస్సులు లేక పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారు. ఈ క్రమంలో బీడ్‌ జిల్లాకు చెందిన మాధవి అనే విద్యార్థిని స్కూల్‌కు వెళ్లేందుకు వినూత్న పద్ధతిని ఎంచుకుంది. రోజూ గుర్రంపై స్వారీ చేస్తూ స్కూల్‌కు వెళుతోంది. ఉజ్నీలోని సిద్ధేశ్వర్‌ విద్యాలయంలో ఏడో తరగతి చదువుతున్న మాధవి గుర్రంపై స్వారీ చేస్తూ పాఠశాలకు వెళుతుండటంతో ఆమె పేరు రాష్ట్రవ్యాప్తంగా చర్చల్లోకెక్కింది.

చదవండి: (పతాకానికి పరాభవమా?)

కరోనా కారణంగా మూతబడిన పాఠశాలలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. ఇదే సమయంలో గత నెల రోజులుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండటంతో బస్సులు లేక గ్రామీణ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ఇదిలావుండగా, మాధవి స్వగ్రామం నుంచి పాఠశాలకు 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోజూ పాఠశాలకు బస్సులో వెళ్లే మాధవి ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో తొలుత చాలా ఇబ్బంది పడింది. దీంతో ఎలాగైనా పాఠశాలకు వెళ్ళాలన్న ఆమె సంకల్పానికి ఇంట్లో పెంచుకుంటున్న గుర్రం దారి చూపినట్లయింది.

చదవండి: (పెళ్లి వయసు పెంచితే సరిపోతుందా?)

వెంటనే గుర్రం మీద బడికి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. అంతే అప్పటి నుంచి ఆ చిన్నారి ప్రతీరోజు గుర్రం మీదే పాఠశాలకు వెళ్లి వస్తోంది. గుర్రం స్వారీ చేయడమే కాకుండా, దానికి జీను వేయడం, ముక్కుతాడు కట్టడం లాంటి పనులు కూడా మాధవినే చేసుకుంటుంది. ఎలాగైన బడికి వెళ్లాలన్న మాధవి తపన చూసిన పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, అధికారులు ఆమెను అభినందించారు.  

మరిన్ని వార్తలు