షిర్డీకని వెళ్లి అనంతలోకాలకు.. పాపం గాయాలతో చిన్నారి

31 Dec, 2022 07:08 IST|Sakshi
మృతులు మాన్సీ, మనోజ్‌ జోషి (ఫైల్‌ ఫొటో) 

ముంబై: షిర్డీ సాయిని దర్శించుకునేందుకు బయలుదేరిన భక్తులను కాలం కాటేసింది. ముంబై – నాసిక్‌ జాతీయ రహదారిపై యెవైనాకా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. వారి కూతురు గాయాలతో బయటపడింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటన భాండూప్‌లో విషాదాన్ని నింపింది.

పోలీసుల వివరాల ప్రకారం.. పశ్చిమ భాండూప్‌ టెంభిపాడ తానాజీవాడి చాల్‌లోని మనోజ్‌ జోషి (36), మాన్సీ జోషి(34) దంపతులతో పాటు అదే ప్రాంతంలోని మరికొందరు కొత్తసంవత్సరంనాడు షిర్డీ సాయిని దర్శించుకోవాలని షిర్డీకి బయలుదేరారు. కొన్ని కుటుంబాలు మినీ బస్సులో బయలుదేరగా జోషి దంపతులతోపాటు మరి కొందరు ద్విచక్రవాహనాలపై బయలుదేరారు.

జోషి దంపతులు.. భివండీ తాలూకాలోని యెవైనాకాకు చేరుకోగానే వేగంగా వచ్చిన ఓ కంటెయినర్‌ వెనుక నుంచి కొట్టింది. దీంతో మనోజ్‌ జోషి, మాన్సీ జోషీలిద్దరు ఘటన స్థలంలోనే మృతి చెందారు. వారి మూడేళ్ల కూతురు మన్మాయి మాత్రం గాయాలతో బయటపడింది. విషయం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న తాలూకా పోలీసులు మృతదేహాలను భివండీలోని ఇందిరాగాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కంటెయినర్‌ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.  

మరిన్ని వార్తలు