రెండు నెలలు.. లక్ష వివాహాలు.. ఫంక్షన్‌ హాళ్లకు భారీగా డిమాండ్‌

25 Nov, 2022 10:11 IST|Sakshi

డిసెంబర్, జనవరిలో మంచి ముహూర్తాలు

కిటకిటలాడుతున్న బంగారం దుకాణాలు

కరోనా కారణంగా గత రెండేళ్లుగా స్తంభించిన వ్యాపారాలు 

సాక్షి, ముంబై: కరోనా తరువాత ఏకంగా రెండేళ్లకు పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కానుండటంతో డెకోరేటర్లు, ఫుడ్‌ క్యాటరింగ్, ఫంక్షన్‌ హాలు, వీడియో, ఫోటోగ్రాఫర్లకు చేతి నిండా పని దొరికినట్లయింది. అంతేగాకుండా వీరిపై ఆధారపడిన వేలాది కార్మికులు, కూలీలకు కూడా ఉపాధి దొరికింది. వచ్చే వారం నుంచి పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభమవుతుంది. దీంతో కరోనా కారణంగా ప్రభుత్వం అమలుచేసిన లాక్‌డౌన్‌ వల్ల వాయిదా వేసుకున్న అనేక పెళ్లిళ్లకు ఇప్పుడు మంచి ముహూర్తాలు లభించాయి. కొందరు పెళ్లిల్లు చేసుకున్నప్పటికీ అనేక ఆంక్షలకు, షరతులకు కట్టుబడి ఉండాల్సి వచ్చింది.

కానీ ఈసారి దీపావళి తర్వాత మంచి ముహూర్తాలు డిసెంబర్, జనవరిలో ఉన్నాయి. దాదాపు లక్ష నుంచి లక్షన్నర వరకు పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేశారు. దీంతో డెకొరేటర్లు, క్యాటరింగ్, హాలు, టూరిస్టు వాహనాలు, మెహందీ (గోరింటాకు) ఆర్టిస్టులను ముందుగానే బుకింగ్‌ చేసుకుని ఉంచారు. వీరితోపాటు మార్కెట్లో కొత్త దుస్తులు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడంవల్ల వ్యాపారులకు కూడా మంచి రోజులు వచ్చాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా బేరాలు లేక ఆర్థికంగా నష్టపోయిన వ్యాపారులు ఇప్పుడు కొంత తేరుకుంటున్నారు. 

శుభకార్యాలపై మహమ్మారి ప్రభావం... 
కరోనా కాలంలో శుభ, అశుభ కార్యక్రమాలకు ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. గత్యంతరం లేక అనేక మంది వాయిదా వేసుకున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే వధువు, వరుడి తరఫున 25 మంది చొప్పున బంధువులను అనుమతించారు. దీంతో సాదాసీదాగా పెళ్లి తంతు పూర్తి చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వం విధించిన ఆంక్షలవల్ల కేటరింగ్, డెకోరేటర్లు, వీడియో, ఫోటో గ్రాఫర్లు ఆర్థికంగా నష్టపోయారు. ఒక్కో పెళ్లిలో 500–700 మందికి ఫుడ్‌ సప్లయిచేసే క్యాటరింగ్‌ యజమానులు ఆంక్షలవల్ల కేవలం 50 మందికే సరఫరా చేయాల్సి వచ్చింది.

చదవండి: (National Highways: రాయలసీమకు కొత్తగా 9 జాతీయ రహదారులు)

హాలులో కుర్చీలు, తివాచీలు, కళ్లు జిగేల్‌మనిపించే విద్యుత్‌ దీపాలకు, ఇతర అలంకరణ సామాగ్రికి డిమాండ్‌ లేకపోవడంతో డెకొరెటర్లు కూడా నష్టపోయారు. ముఖ్యంగా పెళ్లిళ్లలో వీడియో, ఫోటో గ్రాఫర్ల డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. అలాగే పెళ్లిలో బారాత్‌లు కూడా లేకపోవడంతో బ్యాండ్, ఇతర భాజాభజంత్రీలకు, మేళతాళాలకు, డప్పులు వాయించే వీరికి కూడా చేతినిండి పనిలేకుండా పోయింది. దీంతో గత రెండేళ్లుగా అరకొర ఆర్డర్లతో ఎలాగో నెట్టుకొస్తున్నారు. ప్రవేశ ద్వారం, హాలు, స్టేజ్‌ను అలంకరించే డెకొరేటర్లు లేకపోవడంతో పూలకు కూడా డిమాండ్‌ పడిపోయింది.

ఇప్పుడు కరోనా నియంత్రణలోకి రావడంతో ధైర్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. డెకొరేటర్లు, ఫుడ్‌ కేటరింగ్, హాలు, కెమరా మెన్లకు, బ్యాండ్‌ మేళతాళాలు వాయించే వారికి భారీ డిమాండ్‌ ఏర్పడింది. పనిచేసే కూలీలు, కార్మికులను కూడా సమకూర్చుకుని సిద్ధంగా ఉంచుకున్నారు. బారాత్‌లకు అవసరమైన టూరిస్టు వాహనాలను, బంధువులను తీసుకెళ్లేందుకు బస్సులు, టాటా సుమోలు, క్వాలీస్‌ తదితర వాహనాలను కూడా ముందుగానే బుకింగ్‌ చేసుకుని ఉంచుకున్నారు. ఇలా అన్ని రంగాల వారికి చేతినిండా ఉపాధి లభించడంతో రెండేళ్ల తరువాత ఆర్ధికంగా నిలదొక్కుకునే అవకాశం లభించింది.  

మరిన్ని వార్తలు