బచ్చన్‌ ఫ్యామిలీకి మరింత భద్రత

16 Sep, 2020 14:19 IST|Sakshi

ముంబై: బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వినియోగంపై రవికిషన్‌ చేసిన వ్యాఖ్యలను జయాబచ్చన్‌ రాజ్యసభలో ప్రస్తావించిన అనంతరం ముంబై పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బచ్చన్‌ల ఇంటికి సెక్యూరిటీ మరింత పెంచారు. జుహూలోని బచ్చన్స్‌ ఐకానిక్‌ బంగ్లా అయిన జల్సా వెలుపల అదనపు భద్రత కల్పించారు. సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్ కేసుకు సంబంధించి బాలీవుడ్‌పై వస్తోన్న ఆరోపణలపై జయాబచ్చన్‌ మంగళవారం రాజ్యసభలో ప్రసంగించించారు. ఆమె ప్రసంగంపై సోషల్‌ మీడియాలో భిన్నరకాలుగా ట్రోల్స్‌ వచ్చిన తర్వాత ముందు జాగ్రత్త చర్యగా భద్రతను కట్టుదిట్టం చేశారు.

అయితే బాలీవుడ్‌లో మాదక ద్రవ్యాల వినియోగంపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ఎంపీ రవి కిషన్ వ్యాఖ్యానించారు. దీనికి జయా బచ్చన్‌ స్పందిస్తూ.. కొంతమంది వ్యక్తుల కారణంగా బాలీవుడ్‌ ప్రతిష్టను కించపర్చడం సరి కాదు. అది కూడా సినీ పరిశ్రమకు చెందిన ఓ వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు' అంటూ జయాబచ్చన్‌ మండిపడిన సంగతి తెలిసిందే. కాగా.. బుధవారం పార్లమెంటులో జయాబచ్చన్‌ తీసుకున్న వైఖరికి శివసేన మద్దతుగా ముందుకు వచ్చింది. రవికిషన్‌ ఆరోపణలపై శివసేన అనుబంధ పత్రిక సామ్నా సంపాదకీయంలో 'అలాంటి వాదనలు చేసేవారు కపటవాదులని.. వారి ప్రకటనలు ద్వంద్వ ప్రమాణాలు కలిగి ఉంటాయని పేర్కొంది.  (రవి కిషన్‌ వ్యాఖ్యలు సిగ్గు చేటు)

మరిన్ని వార్తలు