పిల్లి తోక కత్తిరించారు.. వారిని అరెస్ట్‌ చేయండి

3 May, 2021 22:32 IST|Sakshi

ముంబై: మూగజీవాలను హింసిస్తే నేరమనేది అందరికీ తెలుసు. అయినా కూడా వాటిపై వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా కొందరు ఓ పిల్లి తోక కత్తిరించడంతో ఓ జంతు ప్రేమికుడు తల్లడిల్లిపోయాడు. వెంటనే వైద్యం అందించి నేరుగా పోలీస్‌స్టేషన్‌ చేరుకున్నాడు. పిల్లి తోక కత్తిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని అతడు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

ముంబైలోని మలాడ్‌ పశ్చిమ ప్రాంతంలో అజయ్‌ షా నివసిస్తున్నాడు. అతడు జంతు ప్రేమికుడు. అతడి ఇంటికి రోజూ ఓ పిల్లి వస్తుండడంతో దానికి ఆహారం అందిస్తూ ప్రేమగా చూసుకుంటున్నాడు. అయితే ఆదివారం (మే 2) మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఆ పిల్లి తీవ్ర గాయాలతో ఇంటికి వచ్చింది. దాన్ని చూసి అజయ్‌ ఆందోళన చెందాడు. పిల్లిని పరిశీలించగా తోక మొత్తం ఎవరో కత్తిరించి ఉంది. వెంటనే ఆ పిల్లిని ఎవర్‌షైన్‌నగర్‌లోని వెటర్నరీ క్లినిక్‌కు వెళ్లాడు. అక్కడ దానికి చికిత్స అందించారు. అయితే పిల్లి తోకను పదునైన ఆయుధంతో కత్తిరించారని అక్కడి సిబ్బంది తెలిపారు.

అయితే పిల్లి తోకను ఎవరో ఉద్దేశపూర్వకంగా కత్తిరించాడని భావించి మలాడ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పిల్లి తోక కత్తిరించిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు అందించాడు. ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆయన నివసిస్తున్న ప్రాంతాలను సీసీ ఫుటేజీలో పరిశీలిస్తున్నారు. పిల్లి తోక కత్తిరిస్తున్న వారిపై జంతు క్రూరత్వ నిరోధక చట్టం (సెక‌్షన్‌ 428) కింద కేసు నమోదైంది. 

చదవండి: తొలిసారి గిరిజన ఎమ్మెల్యేకు సోకిన కరోనా
చదవండి: డీఎంకే విజయంలో ‘ఇటుక’దే కీలక పాత్ర

మరిన్ని వార్తలు